సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వప్రయోజనాల కోసమే పాకులాడుతున్నారని, ఆయనకు రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం పట్టడం లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాజన్న దొర, కంబాల జోగులు, పుష్పవాణి, కళావతి మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్సీపీ ఎంపీలకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యేలు... ఈ సందర్భంగా దీక్షా శిబిరంలో మాట్లాడారు.
ప్రత్యేక హోదా సంజీవిని కాదన్న చంద్రబాబు నోటితోనే.. హోదా సంజీవిని అన్న మాట చెప్పించిన నాయకుడు వైఎస్ జగన్ అని గుర్తుచేశారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. ఆనాడు చంద్రబాబు కేంద్రం ఇస్తానన్న ప్యాకేజీకి ఒప్పుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. ప్రతి ఒక్కరూ హోదా ఉద్యమంలో స్వచ్ఛదంగా పాల్గొంటున్నారని, హోదాపై యువభేరీలు, దీక్షలు, బంద్లు చేసిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ అని అన్నారు. వైఎస్ జగన్ పోరాటాలతోనే హోదా అంశం సజీవంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాజన్న దొర, కంబాల జోగులు, పుష్పవాణి, కళావతి స్పష్టం చేశారు.
ప్రధానిగారూ.. నెరవేర్చండి!
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని గత ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి మనవరాలు కేసీరెడ్డి వసంత కవిత కోరారు. వైఎస్సార్సీపీ ఎంపీలు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపి ఆమె మాట్లాడారు. విభజనతో నష్టపోయిన ఏపీని కేంద్రం ఆదుకోవాలని, విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలని కోరారు.