‘అలా చేస్తే చంద్రబాబును గుడ్డలూడదీసి తంతారు’

2 Nov, 2018 13:05 IST|Sakshi

సొంత పార్టీ నేతలకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారు

‘చేతి’లో చెయ్యేసి.. రక్తం పూసుకున్నట్టేనా..!

చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల ఫైర్‌

సాక్షి, విజయనగరం : కాంగ్రెస్‌తో కలిస్తే చంద్రబాబును గుడ్డలూడదీసి తంతారని వ్యాఖ్యానించిన మీ పార్టీ వ్యవస్థాపక సభ్యులు మంత్రి అయ్యన్నపాత్రుడు, ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తిలకు ఏం సమాధానం చెప్తారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి చంద్రబాబును ప్రశ్నించారు. ఏ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించారో.. తిరిగి అదే పార్టీతో కలవడం ద్వారా ఆయన ఆత్మ క్షోభిస్తుందని టీడీపీ నేతలు మదన పడుతున్నారనీ ఈ విషయం చంద్రబాబుకు పట్టదా అని కోలగట్ల నిప్పులు చెరిగారు. 

కాంగ్రెస్‌ పార్టీది రక్తంతో తడిసిన హస్తమని నాడు వ్యాఖ్యానించిన చంద్రబాబు నేడు అదే చేతిలో చెయ్యేసి నడుస్తున్నారని కోలగట్ల అన్నారు. అంటే మీ చేతులకు రక్తం అంటించుకున్నట్టు అంగీకరిస్తున్నట్టేనా అని ప్రశ్నించారు. కేసుల నుంచి బయట పడేందుకు, మీ అవినీతి చరిత్ర పై విచారణ ఎదుర్కొనేందుకు ఓ జాతీయ పార్టీ అవసరం కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో జతకడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఆగర్భశత్రువైన కాంగ్రెస్‌ పార్టీతో టీడీపీ జతకట్టడాన్ని తెలుగు ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. 

‘పదవుల కోసం చంద్రబాబు ఏ స్థాయికైనా దిగజారుతాడు. ఎంతటి నీచ నికృష్ట రాజకీయాలు చేయడానికైనా సిద్దపడతారని మరోసారి రుజువైంది’ అని ఎమ్యెల్సీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ పార్టీ ఏపీకి అన్యాయం చేసిన విషయాన్ని మర్చిపోయారా అని ఆయన బాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. ఖబడ్దార్ చంద్రబాబూ అంటూ కోలగట్ల వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు