తలమీద తుపాకీ పెట్టినా భయపడలేదు : సురేష్‌

25 May, 2020 15:18 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : రాజధాని ప్రాంతంలో తాను భూములను కబ్జా చేసినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ సవాల్‌ విసిరారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించపోతే చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాజధానిలో తానూ తన అనుచరులు భూమిని కబ్జా చేశారని తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎప్పుడూ అబద్ధాలతో  బతికే  చంద్రబాబుకు నిజ నిర్ధారణ కమిటీ వేసి అర్హత లేదని అన్నారు. నిజ నిర్ధారణ కమిటీ వేయాల్సింది చంద్రబాబు నాయడు గత ఐదేళ్ల పాలనపైన అని, అప్పుడే చంద్రబాబు, లోకేష్ రాజధాని పేరుతో దోచేసిన భూములు బయటపడతాయని పేర్కొన్నారు. (రెండు నెలల తర్వాత ఏపీకి చంద్రబాబు)

సొమవారం తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో నందిగం సురేష్‌ మాట్లాడారు. ‘నిజనిర్ధారణ కమిటీ వేస్తే టీడీపీ నేతలు చేసిన అరాచకం బయటపడుతుంది. చంద్రబాబుది కోర్టు స్టేల బతుకు. నిజాలు బయట పడకుండా కోర్టు నుంచి అనేక కేసుల్లో స్టే తెచ్చుకుని బతుకుతున్నారు. ఎవరో ఇంటి కోసం మట్టి తోలుకుంటే నేను భూమి కబ్జా చేశానని చంద్రబాబు ఆయన అనుకూల మీడియా విష ప్రచారం చేస్తోంది. దళితుల్ని అడ్డ పెట్టుకొని దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ నేతలు పంట పొలాలు తగలబెట్టి తనపై అనేక తప్పుడు కేసులు పెట్టారు. ఆ కేసులో వైఎస్‌ జగన్‌ పేరు చెప్పమని పోలీసులు తలమీద తుపాకీ పెట్టినప్పుడే  భయపడలేదు. ఇప్పుడు చంద్రబాబుకు నేను ఎందుకు బయపడతాను.’ అని అన్నారు.

మరిన్ని వార్తలు