సాక్షి, విశాఖపట్నం: వంగవీటి రంగా హత్య కేసులో విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే, టీడీపీ నేత వెలగపూడి రామకృష్టబాబు మూడో నిందితుడిగా ఉన్నారని, ఇది తెలియక ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా ఎంపీ విజయసాయి రెడ్డి చేపట్టిన సంఘీభావయాత్ర బుధవారం ఎనిమిదవ రోజుకు చేరింది. విశాలాక్షినగర్ నుంచి బుధవారం పాదయాత్ర ప్రారంభమవ్వగా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన వెంట నడిచారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యేలు భూకబ్జాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ లాభాలకోసమే విమ్స్ ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విమ్స్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.