జన సైనికుడిగా మారడమేమిటి లక్ష్మీ నారాయణ?

18 Mar, 2019 14:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం నడుచుకునే సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ జన సైనికుడిగా మారడమేమిటని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. సోమవారం ట్విటర్‌ వేదికగా జనసేనలో లక్ష్మీనారాయణ చేరికపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఇప్పుడు జనసైనికుడిగా మారడమేమిటి లక్ష్మినారాయణ గారూ. మీరు మొదటి నుంచి చంద్రబాబు ఆదేశాల ప్రకారం నడుచుకునే జవానే గదా. పచ్చ పార్టీలో చేరితే ప్రజలు ఛీకొడతారని అనుబంధ సంస్థలో చేరారా? ఇన్నాళ్లు ఎవరి కోసం పనిచేసారో, ఇకపై ఏం చేస్తారో తెలియదనుకుంటే ఎలా?’  అని ట్వీట్‌ చేశారు.

ఇక మరో ట్వీట్‌లో 35 ఏళ్లుగా చంద్రబాబు పులివెందుల అబ్సెషన్ తో బాధపడుతున్నారని, 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా ఈ ఫోబియాల నుంచి బయట పడలేక పోయారేమిటి తుప్పు నాయుడు గారని ప్రశ్నించారు. అర్థంలేని భయాలను ప్రజలకు అంటించాలని చూస్తున్నారని, మంచి డాక్టర్‌ను కలిస్తే ట్రీట్‌మెంట్ ఇస్తాడన్నారు.

అలెగ్జాండర్‌కు 10 లక్షల సైనికులుంటే తనకు 65 లక్షల సైన్యం ఉందని చంద్రబాబు కటింగులిస్తున్నాడని, కొట్టేసిన 3.75 కోట్ల మంది వ్యక్తిగత వివరాలు కూడా ఉన్నాయని కూడా చెప్పండి పనిలో పనిగా అంటూ ఎద్దేవా చేశారు. ‘తెలుగుదేశం గాలి వీస్తోందని మీ నోటితో ఇంకో సారి అనకండి సార్. ఫ్యాన్ గాలి వీస్తోందని వినిపిస్తుంది ప్రజలకు’ అంటూ సెటైర్లేశారు.

మరిన్ని వార్తలు