అధికారంలో లేకుండా విరాళం ఇ‍వ్వడమేంటి: విజయసాయి రెడ్డి

6 May, 2019 20:54 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి(పాత చిత్రం)

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై  వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి మండిపడ్డారు. ట్విటర్‌ వేదికగా తనదైన శైలిలో చంద్రబాబు పాలనపై సెటైరిక్‌గా విమర్శలు చేశారు.‘ తుఫాన్లు వచ్చినప్పుడల్లా కరెంటు స్థంభాలు కూలకున్నా, జనరేటర్లు, క్రేన్లు అద్దెల పేరుతో దొంగ బిల్లులు సృష్టించి కోట్లు దోచుకుంటున్న ట్రాన్స్‌కోపై దర్యాప్తు జరగాలి. గతంలో ఒడిశాకు వేల కరెంటు స్థంబాలు పంపినట్లు కూడా దొంగ లెక్కలు చూపించారు. ఈ దొంగల ముఠాకు నాయకుడు చంద్రబాబేన’ని ట్వీట్‌ చేశారు.

‘ఒడిశాకు ప్రకటించిన రూ.15 కోట్ల తుఫాను సాయం చంద్రబాబు తాను దోచుకున్న సొమ్ము నుంచి చెల్లించాలి. ప్రాణనష్టం లేకుండా అధికారులు తుపానును సమర్ధంగా ఎదుర్కొంటే, కోడలిని వేధించే అత్తలాగా అధికారం లేకున్నా విరాళం ఇస్తానంటారు. రేపో మాపో ఒడిశా వెళ్లి హడావుడి చేసినా చేస్తార’ని ఎద్దేవా చేశారు.

‘తిత్లి తుఫాను వల్ల రూ.3673 కోట్ల నష్టం వాటిల్లినట్లు కేంద్రానికి చంద్రబాబు నివేదిక  సమర్పించారు. కేంద్రం ఎన్ని నిధులిచ్చిందో, వాటినేం చేశారో కానీ జరగాల్సిన మరమ్మతులు మాత్రం మిగిలే ఉన్నాయి. సూపర్‌ సైక్లోన్‌ ‘ఫోని’  నష్టం రూ.100 కోట్లు కూడా లేకపోవడం బాబు మాయా విన్యాసాలను బయటపెట్టాయ’ని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు