చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన విజయసాయి రెడ్డి

6 Sep, 2018 10:29 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి(పాత చిత్రం)

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కు ఏ పార్టీ అన్యాయం చేసిందో, అదే కాంగ్రెస్‌ పార్టీతో టీడీపీ జతకట్టిందని రాజ్యసభ వైఎస్సార్సీపీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి తీవ్రంగా విమర్శించారు. విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ తలపెట్టిన ప్రజాసంకల్పయాత్రకు విశేష స్పందన వస్తోందని వ్యాఖ్యానించారు. టీడీపీకి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. త్వరలోనే ప్రజలు బుద్ధిచెబుతారని వ్యాఖ్యానించారు. సోషల్‌ మీడియాలో వైఎస్సార్‌సీపీ ఆధిపత్యం సాధించిందని, చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనను ఎండగడుతూ విమర్శించడంలో విజయవంతం అయ్యామని పేర్కొన్నారు.

సోషల్‌ మీడియాను టార్గెట్‌ చేస్తూ జరుగుతున్న అరెస్టులని తిప్పికొడుతున్నామని చెప్పారు. ప్రతిపక్షాన్ని అంతుచూస్తామని సీఎం చేసిన వ్యాఖ్యలను విజయసాయి రెడ్డి ఖండించారు. సోషల్‌ మీడియాలో కార్యకర్తలపై పెట్టిన కేసులు అక్రమ కేసులు అని, ఈ విషయాన్ని సుప్రీం కోర్టు కూడా పేర్కొందని చెప్పారు. ఏపీ శాసనసభ రాజ్యాంగ విరుద్ధమైన సభ అని సాక్షాత్తూ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్న విషయాన్ని గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు తాము ఎందుకు హాజరు కావడం లేదో బహిరంగ లేఖ రాశామని తెలిపారు. 23 మంది పార్టీ ఫిరాయింపులకు పాల్పడి, వారిలో ముగ్గురిని మంత్రులుగా చేసిన ఎమ్మెల్యేలను డిస్‌క్వాలిఫై చేయండి.. మర్నాడే మా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరవుతారని చెప్పారు. శాసనసభ సభ్యులు సభకు వెళ్లకుండా జీతాలు తీసుకోవడంపై విజయసాయి రెడ్డి స్పందించారు. శాసనసభకు వెళితేనే అలవెన్స్‌లు వస్తాయని గుర్తుచేశారు.

ఇంకా మాట్లాడుతూ.. ‘వైఎస్సార్‌సీపీ చేసే విమర్శలు సహేతుకంగా ఉంటాయి. కానీ ప్రభుత్వం వ్యక్తిగత విమర్శలకి దిగుతోంది. హైకోర్టు చంద్రబాబుపై సీబీఐ విచారణకు అదేశించినప్పుడు భయపడి స్టే తెచుకున్నారు. స్పీకర్ కోడెల ఒక ఫ్యాక్షనిస్ట్. ఆయనపై హత్యా కేసులున్నాయి. కేసుల నుంచి ఆయన ఎవరి సాయంతో బయటకు వచ్చారో అందరికి తెలుసు. కేసులు మాఫీ చేయించుకుని స్పీకర్ అయ్యారు. అధికార పార్టీకి స్పీకర్ అడుగులకు మడుగులోత్తుతున్నారని’ తీవ్రంగా విమర్శించారు.

మరిన్ని వార్తలు