వైఎస్సార్‌సీపీ ఎంపీలకు ఘన స్వాగతం

19 Apr, 2018 01:29 IST|Sakshi
గన్నవరం ఎయిర్‌ పోర్టులో ఎంపీలకు స్వాగతం పలుకుతున్న దృశ్యం

ప్రజా సంకల్పయాత్ర నుంచి ప్రత్యేక ప్రతినిధి: ప్రత్యేక హోదా సాధన పోరాటంపై భవిష్యత్‌ కార్యాచరణ ఈనెల 22వ తేదీన ఖరారు కానున్నట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత  మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. హోదా సాధన కోసం లోక్‌సభ సభ్యత్వాలను తృణప్రాయంగా త్యజించి ఆమరణ నిరాహార దీక్ష చేసిన అనంతరం తొలిసారిగా రాష్ట్రంలో అడుగుపెట్టిన వైఎస్సార్‌ సీపీ ఎంపీలు బుధవారం కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం శోభనాపురం వద్ద బస చేసిన పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశం అయ్యారు.

అనంతరం మేకపాటి మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో తాము చేసిన పోరాటం, రాష్ట్రపతితో భేటీ, అనంతర పరిణామాలను అధినేతకు వివరించామని చెప్పారు. ఈ నెల 20న సీఎం చంద్రబాబు తన జన్మదినం సందర్భంగా నిరాహార దీక్ష చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి ప్రధాని మోదీ ప్రధాన బాధ్యుడైతే చంద్రబాబు 2వ బాధ్యుడన్నారు. కాగా, రాష్ట్రానికి తిరిగివచ్చిన వైఎస్సార్‌సీపీ ఎంపీలకు బుధవారం గన్నవరం విమానాశ్రయంలో ప్రజలు ఘనస్వాగతం పలికారు. 


 

మరిన్ని వార్తలు