రాష్ట్రపతి ప్రసంగానికి సవరణలు కోరతాం : విజయసాయిరెడ్డి

31 Jan, 2019 11:11 IST|Sakshi

చంద్రబాబు హుద్‌హుద్‌ తుపాన్‌ లాంటి వారని వ్యాఖ్య

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగం తీవ్ర నిరాశ పరిచిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై ప్రసంగంలో ఎక్కడా పేర్కొనలేదని విమర్శించారు. విశాఖలో రైల్వే జోన్‌, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కేంద్రం అమలు చేయాలని కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి సవరణలు కోరతామని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో కలిసి నిరసన చేపట్టారు. ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కేంద్రానికి ఇదే చివరి అవకాశమని అన్నారు. నాలుగేళ్లపాటు బీజేపీతో అధికారాన్ని పంచుకున్న చంద్రబాబు.. రాష్ట్రానికి అన్యాయం జరగడానికి ప్రధాన కారకుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘చంద్రబాబు హుద్‌హుద్‌ తుపాన్‌ లాంటి వారు.. తుపాన్‌ కంటే ఎక్కువగా రాష్ట్రాన్ని ప్రతిరోజూ నాశనం చేస్తున్నారు. అప్పులు తీసుకొచ్చి ధర్మ పోరాట దీక్షల పేరుతో అధర్మ పోరాటాలు చేస్తున్నారు. నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తప్పక గెలిపిస్తారు’ అని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మీడియాతో చెప్పారు.

మరిన్ని వార్తలు