వైఎస్సార్‌సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం

21 Jun, 2018 19:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ సభ్యులు ఏప్రిల్‌ 6న ఇచ్చిన రాజీనామాలు ఆమోదం పొందాయి. ఎంపీ పదవులకు రాజీనామా చేస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు సమర్పించిన లేఖలు ఆమోదం పొందినట్లు స్పీకర్‌ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. కాగా, గత నెలలో ఇచ్చిన రాజీనామా లేఖలపై తమ నిర్ణయంలో ఎలాంటి మార్పులేదని, రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని, మే 29న స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలిసి వైఎస్సార్‌సీపీ నేతలు వివరించారు. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని సుమిత్రా మహాజన్‌ కోరినా... హోదా పోరులో వైఎస్సార్‌సీపీ నేతలు వెనక్కి తగ్గక పోవడం గమనార్హం. పార్లమెంట్‌ సమావేశాల అనంతరం మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డిలు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 

మే చివర్లో రాజీనామాలపై మరోసారి పునరాలోచించుకోవాలని స్పీకర్‌ సూచించగా... తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని, రాజీనామాలు ఆమోదించాలని పట్టుబట్టి మరీ వైఎస్సార్‌సీపీ నేతలు తమ రాజీనామాలు ఆమోదించేలా చేసి నైతిక విజయం సాధించారు. రాజీనామాలపై రాతపూర్వకంగా మరోసారి నిర్ణయాన్ని(రీ కన్ఫర్మేషన్‌) తెలపాలని స్పీకర్‌ సూచించడంతో ఆ మేరకు ఎంపీలు లేఖలు సమర్పించారు. ‘‘16వ లోక్‌సభ సభ్యత్వానికి నేను 2018 ఏప్రిల్‌ 6న రాజీనామా చేశాను. ఈ రాజీనామాపై పునరాలోచించాలని మే 29న మీరు(స్పీకర్‌) సూచించారు. మీ అమూల్యమైన సలహాకు ధన్యవాదాలు. నేను ముందు తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నాను. ఎంపీ పదవులకు తమ రాజీనామాను ఆమోదించాలని మరోసారి అభ్యర్థిస్తున్నాను’’ అని రాసి ఉన్న లేఖలను నేతలు విడివిడిగా సభాపతికి అందజేసిన విషయం తెలిసిందే.

ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధించిన కథనాల కోసం ఈ కింది లింక్స్ క్లిక్ చేయండి :
మీ త్యాగం వృథా కాదు : వైఎస్‌ జగన్‌

చిత్తశుద్ధి నిరూపించుకున్నాం..

చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి..

వైఎస్‌ జగన్‌కు, చంద్రబాబుకు అంత వ్యత్యాసమా!

ఉప ఎన్నికలు: చంద్రబాబు పోటీకి రారు!

‘వంచన’పై వైఎస్సార్‌ సీపీ గర్జన!

మరిన్ని వార్తలు