సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బుధవారం లోక్సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. హామీల అమలులో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రధానమంత్రి ప్రసంగాన్ని బహిష్కరించినట్లు తెలిపారు. ‘రాష్ట్రపతి ప్రసంగానికి ప్రధానమంత్రి ధన్యవాద ప్రసంగానికి ముందే రాష్ట్ర విభజన గోడు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరాం. మా విన్నపాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. వాకౌట్ చేసి బయటకు వచ్చాం.’ అని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ వైఎస్ఆర్ సీపీ ఎంపీలు రెండోరోజు కూడా సభలో తమ ఆందోళన కొనసాగించారు. సభ ప్రారంభం కాగానే వెల్లోకి దూసుకెళ్లి స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.