సాక్షి, అనపర్తి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర శిబిరం వద్ద వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్స్, పార్టీ కీలక నేతలతో భేటీ అయ్యారు. దాదాపు మూడు గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ భేటీలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక విషయంపై పార్టీ నేతలతో చర్చించి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
సమావేశం అనంతరం వైఎస్సార్సీపీ నేత ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయం తీసుకుందని ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను బీజేపీ నేరవేర్చనందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. పార్లమెంట్ వర్షకాల సమావేశాలు జరిగినంత కాలం పార్లమెంట్ ఆవరణలోనే నిరసన తెలపాలని వైఎస్సార్సీపీ నిర్ణయం తీసుకుంది. రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోనే నిరసన తెలపనున్నారని ధర్మాన పేర్కొన్నారు.