‘కడప స్టీల్‌ ఫ్యాక్టరీ సీఎం రమేష్‌దే’

28 Dec, 2018 12:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  ‘ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా’ అంశంపై గత నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని ఆ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు పునరుద్ఘాటించారు. శుక్రవారం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిరసన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.  రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కడప స్టీల్‌ ప్లాంట్‌ వ్యయం రూ.18 వేల కోట్లుగా చెప్తున్నారు. అది కేంద్ర ప్రభుత్వం నిర్మించాలనుకున్న ప్రాజెక్టు.. దాంతో మీకేం పని అని ప్రశ్నించారు. అది చంద్రబాబు బినామీ అయిన సీఎం రమేష్‌ స్టీల్‌ ఫ్యాక్టరీ అని వ్యాఖ్యానించారు.

‘ఏం చేశాడు బాబు ఏపీకి. ప్రపంచంలో ఉన్న అందమైన బిల్డింగ్‌ల ఫొటోలు తెచ్చి గ్రాఫిక్స్‌ ప్రజెంటేషన్‌ ఇస్తాడు. వాటికి డీపీఆర్‌ రిపోర్టులు ఉండవు. ఎంత ఖర్చో ఉండదు. రాజధాని నిర్మాణానికి 48 వేల కోట్లు ఖర్చు అని అంచనా వేశారు. అభివృద్ధిని గ్రాఫిక్స్‌లో చూపిస్తున్నారు. ప్రణాళిక వ్యయంలో బీసీలు, ఎస్సీ, ఎస్టీల సబ్‌ప్లాన్‌ నిధులు ఖర్చు చేయడం లేదు. పేద ప్రజల నోళ్లు కొట్టి కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నాడు. లంచాలు దండుకుంటున్నాడు. ఇలాంటి దుర్మార్గపు ముఖ్యమంత్రిని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

తీరని ద్రోహం..
ఏపీకి ద్రోహం చేసింది బాబు మాత్రమేనని మాజీ ఎంపీ వరప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 ఏళ్లు ప్రత్యేక హోదా సాధిద్దామని ఓట్లు వేయించుకొన్న బాబు తర్వాత ప్లేటు ఫిరాయించాడని మండిపడ్డారు. ‘హోదా సంజీవని కాదని చెప్పి ప్యాకేజీకి సై అన్నారు. హదా కోసం పోరాడుతుంటే వైఎస్సార్‌సీపీ నేతల్నిహేళన చేశారు. ఏపీకి తీరని ద్రోహం చేశారు. విభజన హామీలను సాధించలేదు. ఎన్నికల వేళ స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు’ అని నిప్పులు చెరిగారు. నిరసన కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు