‘నవనిర్మాణం కాదు.. నయ వంచక దీక్ష’

2 Jun, 2018 15:13 IST|Sakshi
వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి (ఫైల్‌ ఫోటో)

సాక్షి, కమలాపురం: చంద్రబాబు చేపట్టింది నవ నిర్మాణ దీక్ష కాదు నయవంచక దీక్ష అని వైఎస్సార్‌ సీసీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు. శనివారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నాలుగేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు.

ఏం అభివృద్ధి చేశారని నవ నిర్మాణ దీక్ష చేపట్టారో వెల్లడించాలని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేసిన వాగ్దానాలు పూర్తిగా విస్మరించి తుంగలో తొక్కారని అన్నారు. కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసం.. ఆదాయం తెచ్చిపెట్టే పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం వంటివి చేపట్టి కోట్ల రూపాయలు దండుకున్నారని చంద్రబాబుపై ఆయన ఆరోపణలు చేశారు. 

కాపులను బీసీల్లో, వాల్మీకీ కులస్తులను ఎస్టీల్లో చేరుస్తామని బాబు మిన్నకుండి పోయారని అన్నారు. మాదిగలకు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ హామీని మరిచారని అన్నారు. ముఖ్యమంత్రి నాటకాలను ప్రజలు గమనిస్తున్నారనీ, రాబోయే ఎన్నికల్లో ఆయనకు తగిన గుణపాఠం చెబుతారని రవీంద్రనాథ్‌ రెడ్డి జోస్యం చెప్పారు.

మరిన్ని వార్తలు