రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై వీడియో ప్రజెంటేషన్

2 Jan, 2020 20:43 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: అమరావతి విషయంలో టీడీపీ ప్రభుత్వం పాల్పడిన అవినీతికి సంబంధించిన వివరాలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వీడియో ప్రజెంటేషన్‌ రూపంలో విలేకరుల ముందుకు తీసుకువచ్చింది. గురువారం ఇందుకు సంబంధించిన విజువల్స్‌ను పార్టీ కార్యాలయంలో ప్రసారం చేసింది. ఆ వీడియోలో ఉన్న వివరాల ప్రకారం... రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం మార్చి 1, 2014 ఏపీ పునర్విభజన చట్టం చేసింది. హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా చేసింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని పరిశీలనకై మార్చి 28, 2014 కేంద్రం శివరామకృష్ణన్ కమిటి వేసింది. ఈ కమిటీ ఆగస్టు 27, 2014లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అయితే శివరామకృష్ణన్ నివేదిక ఇవ్వకుండానే చంద్రబాబు రాజధాని విజయవాడలో ఉంటుందని ప్రకటించేశారు. 

ఈ క్రమంలో డిసెంబరు 30, 2014లో సీఆర్డీఏ చట్టాన్ని ప్రభుత్వం ఆమోదించింది. చంద్రబాబు నిర్ణయాన్ని శివరామకృష్ణన్ అనేక సందర్భాల్లో తప్పుపట్టిన పట్టించుకోలేదు. నిజానికి శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాకముందే చంద్రబాబు తన మంత్రులు, నాయకులతో ఒక కమిటీ వేశారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌తో 4070 ఎకరాల భూములను టీడీపీ నేతలు అమరావతిలో కొన్నారు. గుంటూరు జిల్లాలో మంగళగిరి, తుళ్లూరు, అమరావతి, తాడికొండ, పెదకూరపాడు, పెదకకాని, తాడేపల్లి మండలాల్లో 2279 ఎకరాలు టీడీపీ నేతలు సొంతం చేసుకున్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం, పెనమలూరు, విజయవాడ రూరల్, చంద్రళ్ళపాడులో 1790 ఎకరాల భూమి టీడీపీ నేతలు కొన్నారు. జూన్ 1, 2014 నుంచి డిసెంబరు 31  2014 వరకు టీడీపీ నేతల ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కొనసాగింది. 

జూన్ 1, 2014 నుంచి డిసెంబరు 31,  2014 వరకు రాజధానిలో కొన్న భూముల వివరాలు

  • జూన్‌లో 530 ఎకరాలు
  • జూలైలో 685 ఎకరాలు
  • ఆగస్టులో 353 ఎకరాలు
  • సెప్టెంబర్ లో 567 ఎకరాలు
  • అక్టోబర్ లో 564 ఎకరాలు
  • నవంబర్ లో 836 ఎకరాలు
  • డిసెంబరులో 531 ఎకరాల భూమిని టీడీపీ నేతలు కొన్నారు.
  • హెరిటేజ్ కంపెనీ 14.22 ఎకరాలు
  • పయ్యావుల కుటంబ సభ్యలు పేరు మీద భూములు
  • వేం నరేందర్‌రెడ్డి కుటంబ సభ్యుల పేరు మీద 15.30 ఎకరాలు
  • పల్లె రఘునాథ్ రెడ్డి కుటంబ సభ్యుల పేరుతో 7.50 ఎకరాలు
  • కొమ్మలపాటి శ్రీధర్ 68.6 ఎకరాలు
  • లంక దినకర్, కంభంపాటి మోహన్ రావు వారి కుటంబ సభ్యుల పేరుతో భూములు కొన్నారు.
  • పరిటాల సునీత తన కుమారుడు, అల్లుడు పేరు మీద భూములు కొన్నారు.
  • కోడెల బినామీ పేరుతో 17.31 ఎకరాల భూమి కొన్నారు.
  • పత్తిపాటి పుల్లారావు బినామిల పేరుతో 38.84 ఎకరాలు భూములు కొన్నారు.
  • ధూళిపాళ్ల నరేంద్ర కుటంబ సభ్యుల పేరు మీద 13.5 ఎకరాలు
  • నారాయణ తన దగ్గర పని చేసే సబ్బంది పేరుతో 55.27 ఎకరాలు
  • రావెల కిషోర్ బాబు తన కంపెనీ పేరుతో 40.85
  • జీవీ ఆంజనేయులు 37.84 ఎకరాలు
  • వేమూరి రవి 25 ఎకరాలు.. కంపెనీ పేర మీద 6.2 ఎకరాలు
  • నారా లోకేష్ బినామిలు కొల్లు శివరాం 47.39 ఎకరాలు
  • నారా లోకేష్ బినామీ గుమ్మడి సురేష్ 42.9 ఎకరాలు
  • నారా లోకేష్ బినామీ బలుసు శ్రీనివాస్ 14 ఎకరాలు భూమి కొన్నారు.

ఇక నారా లోకేశ్‌ మామ బాలకృష్ణ వియ్యంకుడు రామారావుకు  498 ఎకరాలు కేటాయించారు. తరువాత ఆ భూమి ఉండే పరిధిని సీఆర్డీఏలోకి తెచ్చారు. హెరిటేజ్ 14 ఎకరాల భూములు, మురళీమోహన్ 53.29 భూములు ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కకు వచ్చేలా అలైన్‌మెంట్‌ మార్చారు. లింగమనేనికి చెందిన వందలాది ఎకరాలు ల్యాండ్ పూలింగ్‌లోకి రాకుండా చక్రం తిప్పారు. లింగమనేని భూమికి 10 మీటర్ల వరకు వచ్చి ల్యాండ్ పూలింగ్ ఆపేశారు.  దీనికి ప్రతిఫలంగా లింగమనేని గెస్ట్ హౌస్ చంద్రబాబుకు లింగమనేని ఇచ్చారు. అంతేకాదు 800 మంది తెల్ల రేషన్ కార్డుదారులు రాజధానిలో భూములు కొన్నారు. తెలంగాణకు చెందిన 60 మంది తెల్ల రేషన్ కార్డుదారులు సైతం రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారు. అంతేకాదు 2 వేల ఎకరాల అసైన్డ్ భూములను దళితులను బెదిరించి, భయపెట్టి టీడీపీ నాయకులు తక్కువ ధరకు కొన్నారు.

మరిన్ని వార్తలు