చంద్రబాబు రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు : విజయచందర్‌

29 Apr, 2019 15:29 IST|Sakshi

సాక్షి, హైద్రాబాద్‌ : ఒక్క సినిమా తీస్తేనే మీ ప్రభుత్వం కుప్పకూలిపోతుందంటారా అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్‌ విజయచందర్‌.. సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. సోమవారమిక్కడ పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. గన్నవరం ఎయిర్‌పోర్టులో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను నిర్బంధించడం సరికాదని హితవు పలికారు. వర్మ ప్రెస్‌మీట్‌ పెడితే ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏమిటని, ఎందుకంత భయపడుతున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. అసలు ఏ ఉద్దేశంతో వర్మను నిర్బంధించి బయటకు పంపేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

బ్రహ్మాండంగా ప్రచారం చేసుకున్నారు కదా..
‘ ప్రెస్‌మీట్‌ పెట్టాలంటే ప్రభుత్వం పర్మిషన్‌ తీసుకోవాలా. వర్మకు ప్రెస్‌మీట్‌ పెట్టే హక్కు ఉందా లేదా అసలు. కథానాయకుడు, మహానాయకుడు అనే రెండు బయోపిక్‌లకు బ్రహ్మాండంగా ప్రచారం చేసుకున్నారే. మరి ఇతర చిత్రాల గురించి ఆవిధంగా ప్రచారం చేసుకోకూడదా. ఓ వ్యక్తి స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు’అని విజయచందర్‌ మండిపడ్డారు.

మరిన్ని వార్తలు