గడువులోగా హామీని నెరవేర్చండి

7 Mar, 2018 11:14 IST|Sakshi

యూసీఐఎల్‌ సీఎండీతో ఫోన్‌లో మాట్లాడిన కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

వేముల : టెయిలింగ్‌ పాండ్‌ పరిధిలోని రైతులకు ఇచ్చిన హామీని గడువులోగా నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవాలని, వారిలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి యూసీఐఎల్‌ సీఎండీ హస్నానిని కోరారు. ఈ మేరకు ఆయన యూసీఐఎల్‌ సీఎండీ హస్నానితో ఫోన్‌లో మంగళవారం మాట్లాడారు. రైతులకు ఈనెల 9వ తేదీలోగా పరిష్కారం చూపుతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. రైతులకు టెయిలింగ్‌ పాండ్‌ వ్యర్థాలతో నష్టాలు జరిగితే ఊరుకునేది లేదని, రైతులతో కలిసి ఉద్యమాలు చేయాల్సి వస్తుందన్నారు. నెలరోజులుగా పరిస్థితి అలాగే ఉందని, ఆ పంట పొలాల్లో తెల్ల ని పదార్థం మేట వేస్తోందని, ఎలాంటి మార్పు లేదని ఆయనకు వివరించారు.

మీ పర్యటన ఖరారైతే ప్రజాసంఘాలు, పౌరహక్కుల నేతలు, శాస్త్రవేత్తలు, రైతులతో కలిసి యురేనియం ప్రాజెక్టులో కానీ , గ్రామాల్లో కానీ సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో వారి వారి అనుమానాలను నివృత్తి చేయడమేకాక పరిష్కా రం చూపాలన్నారు. స్పందించిన సీఎండీ హస్నాని, బాబా అటానమిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌(బార్క్‌) శాస్త్రవేత్తలు కలుషిత సాగునీటితో దెబ్బతిన్న పంట పొలాల్లో మట్టి నమూనాలను, బోర్లలోని నీటిని శాంపిల్స్‌ తీసుకుని వెళ్లారని, వారి నివేదిక అందిన తర్వాతనే పరిష్కార చర్యలు వివరిస్తామన్నారు. ఇందుకు ఈనెల 10, 11వ తేదీలలో యురేనియం ప్రాజెక్టుకు రానున్నట్లు సీఎండీ హస్నాని ఎంపీకి తెలియజేశారు. అలాగే మండలంలోని కె.కె.కొట్టాల, తుమ్మలపల్లె, పులివెందుల మండలం కనంపల్లె గ్రామాలకు పార్నపల్లె నీటిని ట్యాంకులకు నింపుతామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు