అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడతారా?

31 Aug, 2018 20:40 IST|Sakshi

సాక్షి, తాడేపల్లిగూడెం: టీడీపీ నాయకుల అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో జరిగిన నరసాపురం పార్లమెంట్‌ రివ్యూ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వరదల కారణంగా నష్టపోయిన కౌలు రైతులకు న్యాయం జరగడం లేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కౌలు రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఇప్పటివరకు ముంపుకు గురైన పోలాలను గుర్తించలేదని మండిపడ్డారు. పచ్చ చొక్కాలు కాంట్రాక్టు పనులు చేపట్టడం వల్లనే ఎర్రకాలువకు వరద ముంపు వచ్చిందని విమర్శించారు.

డెల్టా మోడ్రనైజేషన్‌ పనుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వలన పశ్చిమగోదావరి జిల్లా నష్టపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో నియంతపాలన సాగుతోందన్నారు. జిల్లా కలెక్టర్‌ ఒక ప్రజానాయకునికిపై కేసులు పెట్టడంలో అర్థమేమిటని ప్రశ్నించారు. లంచమడిగాడని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును ఓ కాంట్రాక్టర్‌ ప్రశ్నిస్తే ఆయనపై కేసులు పెట్టిన సంఘటన ప్రపంచం మొత్తం చూసిందని గుర్తుచేశారు. పచ్చ చొక్కా నాయకులు తమ మాముళ్ల వసూళ్ల కోసం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయడం శోచనీయం అన్నారు.

మరిన్ని వార్తలు