చంద్రబాబు పాలనలో స్వేచ్ఛకు చోటు లేదు

6 Mar, 2019 12:25 IST|Sakshi
మాట్లాడుతున్న మంద కృష్ణమాదిగ

సాక్షి, బేస్తవారిపేట (ప్రకాశం) : చంద్రబాబు పాలనలో మాదిగలు కనీసం మీటింగ్‌ పెట్టుకునే స్వేచ్ఛకూడా లేకుండా పోయిందని ఎమ్మార్పీస్‌ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. మంగళవారం స్థానిక ఎబీఎం కాంపౌండ్‌ ఆవరణలో విశ్వరూప సమాయత్త సభలో పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు, కార్పోరేషన్‌ పదవులు ఒక వర్గానికే ఇచ్చి సామాజిక న్యాయం పాటించలేదన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మాదిగనవుతానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి మోసం చేశాడన్నారు. కనీసం అమరావతిలో మాదిగల కురుక్షేత్ర సభను పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వలేదని, మాదిగల మరో విశ్వరూప మహాసభకు అనుమతులు ఇవ్వలేదన్నారు.

రెండు,మూడు రోజుల్లో ఎన్నికల కోడ్‌ వస్తుందని, ఎన్నికల కమిషన్‌ నుంచి అనుమతులు తీసుకుని మన సత్తా చాటుదామన్నారు. మన హక్కుల సాధనకై కలిసికట్టుగా మన సత్తాచాటాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరు విశ్వరూప సభకు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య,  జిల్లా ఇన్‌చార్జ్‌ సూరెపోగు శ్యామ్, రాష్ట్ర నాయకులు పానుగంటి సాలెమ్‌రాజు, పులిగుజ్జు ప్రాంక్లీన్, బొడిచర్ల రాజు, మండల అధ్యక్షుడు బూదాల ఆనంద్, నాయకులు కుంపటి సురేష్, గుర్రం ఆనంద్, గోన గురవయ్య, ఆళ్లగడ్డ వాసు, కొండెపోగు పోలయ్య, గోన శరత్, తిరుపతి శాంతమ్మ, కొండెపోగు ప్రసన్న, జయరాజ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు