పీఎస్‌ఎల్‌వీ సీ40కి నేడు కౌంట్‌డౌన్‌ ప్రారంభం

11 Jan, 2018 02:56 IST|Sakshi
షార్‌ మొదటి ప్రయోగవేదికపై సిద్ధంగా ఉన్న పీఎస్‌ఎల్‌వీ సీ40

రేపు ఉదయం 9.28 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనున్న రాకెట్‌

శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి శుక్రవారం ఉదయం 9.29 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ40 నింగిలోకి దూసుకెళ్ల నుంది. ఈ విషయాన్ని బుధవారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌ హాల్లో జరిగిన మిషన్‌ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్‌ఆర్‌)లో అధికారికంగా ప్రకటించారు. రాకెట్‌కు అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన అనంతరం సాయంత్రం ఎంఆర్‌ఆర్‌ కమిటీ వారు  ప్రయోగ పనులను లాంచ్‌ ఆథరై జేషన్‌ బోర్డుకి అప్పగించారు.

లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు చైర్మన్‌ పీ కున్హికృష్ణన్‌ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి సమావేశం నిర్వహించి గురువారం తెల్లవారుజామున 5.29 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు. పీఎస్‌ ఎల్‌వీ సీ40 ద్వారా 1,323  కిలోల బరువు కలిగిన 31 ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. 710 కిలోల బరువు కలిగిన కార్టోశాట్‌–2 సిరీస్‌లో ఐదో ఉపగ్రహంతో పాటు దేశీయంగా ఒక సూక్ష్మ ఉపగ్రహం, మరో బుల్లి ఉపగ్రహంతో పాటు ఆరు దేశాలకు చెందిన 28 ఉపగ్రహాలు ప్రయోగించనున్నారు. గతేడాది ఆగస్టు 31న ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సీ39 విఫలమైనందున ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రయోగానికి సిద్ధమవుతున్నారు.

మరిన్ని వార్తలు