కేసీఆర్‌కు ఈసీ నోటీసులు

11 Apr, 2019 03:33 IST|Sakshi

కరీంనగర్‌ సభలో చేసిన వ్యాఖ్యలపై రేపట్లోగా వివరణకు ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మార్చి 17న కరీంనగర్‌ సభలో ఆయన హిందువు లపై అమర్యాదకర వ్యాఖ్యలు చేశారంటూ అందిన ఫిర్యాదు ఆధారంగా ఈ నోటీసులు పంపింది. ‘‘ఈ హిందూ గాళ్లు.. బొందు గాళ్లూ.. దిక్కుమాలిన.. దరి ద్రపు గాళ్లు..’’అంటూ కేసీఆర్‌ వ్యాఖ్యలు చేశారని, అలాగే ‘‘దేశంలో అగ్గి పెట్టాలే. గత్తర లేవాలె’అంటూ హిందువులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాంరాజు చేసిన ఫిర్యాదును ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంది. దీనిపై శుక్రవారం సాయంత్రం 5లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

కేసీఆర్‌ ప్రసంగాన్ని ఆంగ్లంలో తెప్పించుకోవడంతోపాటు రాష్ట్ర సీఈవో ద్వారా వాస్తవ నివేదిక తెప్పించుకొని పరిశీలించినట్లు సీఈసీ నోటీసులో పేర్కొంది. ‘కేంద్ర ఎన్నికల సంఘం ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి వచ్చింది. మీరు చేసిన ప్రకటన.. మత సామరస్యానికి విఘా తం కలిగించేలా ఉంది.  మతపర విభేదాలను పెంచేదిగా ఉంది. తద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మీరు ఉల్లంఘించారు. దీనిపై సంజాయిషీ ఇచ్చేం దుకు కమిషన్‌ మీకు ఒక అవకాశం కల్పిస్తోంది. 12వ తేదీ సాయంత్రం 5లోగా మీరు వివరణ ఇవ్వండి. ఇందులో మీరు విఫలమైతే తదుపరి ఎలాంటి నోటీసు లేకుండా చర్యలు తీసుకుంటాం’ అని కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులో పేర్కొంది.

చింతమడకలో కేసీఆర్‌ ఓటు 
సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ తన సొంత ఊరు చింతమడకలో సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కేసీఆర్‌ గురువారం హెలికాప్టర్‌లో చింతమడకకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుని హెలికాప్టర్‌లోనే తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. హెలికాప్టర్‌ దిగేందుకు వీలుగా చింతమడకలో ఏర్పాట్లు చేశారు. 

మరిన్ని వార్తలు