హరితహారానికి సిద్ధంకండి

15 Mar, 2019 03:01 IST|Sakshi

కలెక్టర్లతో సీఎస్‌ ఎస్‌కే జోషి  

సాక్షి, హైదరాబాద్‌: ఐదో విడత హరితహారం కోసం అన్ని జిల్లాలు తమ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి సూచించారు. గురువారం సచివాలయంలో కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పెంచుతున్న మొక్కల్లో కచ్చితంగా 25 నుంచి 30 శాతం అటవీ పండ్ల జాతులు, మరో పది శాతం ఇళ్లలో పెంచుకునే మొక్కలు ఉండాలన్నారు. ప్రాంతాల వారీగా వాతావరణ పరిస్థితులు, ప్రజలు కోరుకున్న మొక్కలు అందించేలా అటవీ, గ్రామీణాభివృ ద్ధి, మున్సిపల్‌ శాఖలు సిద్ధం కావాలని సూచించారు.

ఇంకా వెయ్యి పంచాయతీల్లో నర్సరీలను సిద్ధం చేయాల్సి ఉందని, వెంటనే ఆ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో నర్సరీల పెంప కానికి స్వయం సహాయక బృందాలను భాగస్వామ్యం చేయాలన్నారు. 66 లక్షల ఎకరాల అటవీ భూమికి సంబం ధించి ఇప్పటికే సమారు 54 లక్షల ఎకరాల పరిశీలన, రెవెన్యూ రికార్డుల్లో గుర్తించడం పూర్తయిందని, మిగతావి కూడా వివిధ దశల్లో ఉన్నాయని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ తెలిపారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా, పీఆర్‌ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌ రాజ్, కమిషనర్‌ నీతూ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు