జన్వాడలో టీఆర్‌ఎస్‌ విజయం

14 Jan, 2018 10:34 IST|Sakshi

ఎంపీటీసీ సభ్యుడిగా మల్లేశ్‌గౌడ్‌ ఎన్నిక

విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నమంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య

శంకర్‌పల్లి:  మండలంలోని జన్వాడ ఎంపీటీసీ స్థానానికి  జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించింది. ఈ నెల 11న పోలింగ్‌ జరగగా.. శనివారం ఓట్ల లెక్కింపు నిర్వహించారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఒక స్వతంత్ర  అభ్యర్థి పోటీ చేయగా.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మల్లేశ్‌గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి టి.నాగేందర్‌పై 561 ఓట్ల మోజార్టీతో గెలుపొందారు. మొత్తం 3,111 ఓట్లకు గాను.. 2,359 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మల్లేశ్‌ గౌడ్‌కు 1,388 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి నాగేందర్‌కు 827, బీజేపీకి 68, టీడీపీకి 27, స్వతంత్ర అభ్యర్థికి 35, నోటాకు 14 ఓట్లు వచ్చాయి. మల్లేశ్‌గౌడ్‌ 561 ఓట్ల మోజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి జగన్‌రెడ్డి  ప్రకటించారు.  

శంకర్‌పల్లిలో విజయోత్సవ ర్యాలీ..
 జన్వాడ ఎంపీటీసీ స్థానం టీఆర్‌ఎస్‌కు కైవసం కావడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకొన్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో మంత్రి మహేందర్‌రెడ్డి,  ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్‌.రత్నం, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. మల్లేశ్‌గౌడ్‌కు స్వీట్లు తినిపించి   అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి  , సంక్షేమ పథకాలే తమ అభ్యర్థి విజయానికి కారణమయ్యాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రజల పూర్తి మద్దతు ఉందని చెప్పారు. సాధారణ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు  వెంకట్‌రెడ్డి,  నాయకులు వాసదేవ్‌కన్న,  మల్లేశ్‌యాదవ్, రవీందర్‌గౌడ్, అశోక్‌కుమార్, సర్పంచులు మానిక్‌రెడ్డి, శ్రీధర్‌ తదితరులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు