పోలీస్‌ కస్టడీ నుంచి నిందితుడి పరార్‌?

26 Jan, 2018 16:15 IST|Sakshi

సదాశివపేట(సంగారెడ్డి): సదాశివపేట పోలీసుల కస్టడీ నుంచి నిందితుడు 1వ వార్డు కౌన్సిలర్‌ అరుణ్‌కుమార్‌ గురువారం పోలీసుల కళ్లుగప్పి ఛాకచక్యంగా తప్పించుకుపారిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. నిందితుడు అరుణ్‌కుమార్‌పై వివిధ వివాదాలకు సంబంధించి ఇదివరకే 3 కేసులు నమోదయ్యాయి. తాజాగా సాయిబాబా మందిరం కాలనీలో నిర్మిస్తున్న ఓ చర్చి విషయంలో తలదూర్చి పాదర్‌ డేవిడ్‌ను బేదిరించి భయబ్రాంతులకు గురి చేసిన విషయంలో ఈ నెలలో అతనిపై మరో కేసు నమోదైంది. నాలుగు కేసులకు సంబంధించి కౌన్సిలర్‌ అరుణ్‌కుమార్‌ను పోలీసులు గురువారం సాయంత్రం 4 గంటలకు అదుపులోకి తీసుకుని విచారించారు. రిమాండ్‌ రిపోర్టు రాసిన తరువాత వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా పోలీసుల కళ్లుకప్పి తప్పించుకుపారిపోయినట్లు సమాచారం.

కౌన్సిలర్‌ అరుణ్‌కుమార్‌పై  2016లో 384, 379 సెక్షన్ల కింద వేర్వేరుగా రెండు కేసులు నమోదయ్యాయి. 2017లో 448, 447 సెక్షన్ల కింద మరో కేసు నమోదైంది. 2018 జనవరిలో 447, 506 సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇన్‌స్పెక్టర్‌ సురేందర్‌రెడ్డిను వివరణ కోరగా కౌన్సిలర్‌ అరుణ్‌కుమార్‌పై నమోదైన కేసులకు సంబంధించి అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. పోలీస్టేషన్‌లో ఉన్న నిందితుడు అరుణ్‌కుమార్‌  ఫోన్‌ మాట్లాడుకుంటూ బయటకి వేళ్లిపోయాడని సమాధానమిచ్చారు.  

మరిన్ని వార్తలు