డివైడర్‌ను ఢీకొన్న బుల్లెట్‌ బైక్‌

27 Jan, 2018 19:20 IST|Sakshi
ఘటనా స్థలంలో నవీన్‌కుమార్, రాఘవకుమార్‌

ఇద్దరి దుర్మరణం

పటాన్‌చెరు టౌన్‌: బుల్లెట్‌ బైక్‌ డివైడర్‌ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన పటాన్‌చెరు పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి కథనం ప్రకారం... పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌ గ్రామానికి చెందిన పోచారం నవీన్‌ కుమార్‌(21) ఓ మొబైల్‌ షాప్‌ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతని స్నేహితుడు సంగారెడ్డి శివాజీనగర్‌కు చెందిన పెరుమాండ్ల సాయి రాఘవకుమార్‌(23) కిరణా షాపు నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో గురువారం రాఘవకుమార్‌ తన స్నేహితుడు నవీన్‌కుమార్‌ వద్దకు ఇస్నాపూర్‌ వచ్చాడు.

గురువారం రాత్రి సాయి రాఘవకుమార్‌ను సంగారెడ్డి వద్ద వదలి రావటానికి నవీన్‌కుమార్‌ తన బుల్లెట్‌పై సంగారెడ్డికి బయలుదేరారు. పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామ శివారులో డివైడర్‌ను ఢీకొనడంతో రోడ్డు అవుతలివైపు సంగారెడ్డి నుంచి పటాన్‌చెరు వచ్చే దారివైపు ఇద్దరూ పడటంతో తీవ్ర గాయాలయ్యాయి.

చికిత్స నిమిత్తం నవీన్‌కుమార్‌ను బీరంగూడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నవీన్‌కుమార్‌ రాత్రి మృతి చెందాడు. సాయి రాఘవకుమార్‌ను గాంధీకి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు