ఈ ఎయిర్‌ హోస్టెస్‌కు సోషల్‌ మీడియా సలాం!

11 Nov, 2018 14:07 IST|Sakshi

సోషల్‌ మీడియా మొత్తం ఇప్పుడు ఆ ఎయిర్‌ హోస్టెస్‌కు హ్యాట్సాఫ్‌ చెబుతోంది. ఆకలితో గుక్కపట్టిన ఓ ప్రయాణికురాలి బిడ్డకు పాలిచ్చి అమ్మ ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఫిలిప్పిన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ప్రతీశా అనే ఎయిర్ హోస్టెస్. దీంతో మొన్నటిదాకా ఎవ్వరికీ తెలియని ఆమె పేరు, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ఈ విషయాన్ని ఆమె ‘చాలా తృప్తి పడే పనిచేశాను.. సంతోషంగా ఉంది’ అంటూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అయింది.  ఈ పోస్ట్‌కు ఏకంగా 35 వేలకు పైగా షేర్లు, 8.1 వేల కామెంట్లు రావడం విశేషం.
 
ఆ పోస్ట్‌ ఏంటంటే.. ‘ఫ్లైట్‌లో ఆకలితో ఉన్న ఓ పసిపాపకు నా పాలిచ్చాను. రోజువారి పనిలో భాగంగానే ఫ్లైట్‌లో నా పని నేను చేసుకుంటున్నాను. ఫ్లైట్‌ టేకాఫ్ అయిపోయింది. ఇంతలో నాకు ఓ పసిపాప ఏడుపు వినిపించింది. దీంతో నేను ఆ పసిపాప తల్లి వద్దకు వెళ్లాను. ఆ తల్లి కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నది. ఎందుకమ్మా, పాప ఏడుస్తున్నది.. ఆకలితో ఉన్నట్టుంది.. పాలు పట్టండి అన్నాను. పాపకు పట్టే ఫార్ములా పాలు అయిపోయాయని ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది. ఫ్లైట్‌లోని తోటి ప్రయాణీకులంతా ఏమైందని అడుగుతున్నారు. రకరకాలుగా ఆలోచిస్తున్నారు. విమానంలో మామూలు పాలు తప్పా ఫార్ములా పాలు లేవు.  ఆ పాప ఏడుపు, తోడుగా ఆ తల్లిని చూస్తే బాధేసింది. నాకు ఎక్కడో కదిలినట్టు అనిపించింది. నా బిడ్డ గుర్తకొచ్చింది. వెంటనే నా పాలు ఇచ్చి ఆ బిడ్డ ఆకలి తీర్చాలనుకున్నాను. ఆ పాపను నా ఒడిలోకి తీసుకొని పాలు పట్టాను. చాలా ఆకలితో ఉందేమో, పాప ఆతృతగా తాగింది. ఆ పాప ఏడుపు ఆపి, నిద్రపోయాక ఆ తల్లికి అప్పగించాను. ఆ తల్లి నాకు కృతజ్ఞతలు తెలిపింది. ఆ క్షణాన  ఆ బిడ్డ ఆకలి తీర్చే శక్తినిచ్చినందుకు ఆ దేవునికి ధన్యవాదాలు. ఇదేమీ గొప్పపని కాదు. కానీ తృప్తినిచ్చే పని. ఈ రోజు నా ఫ్లయింగ్ కెరీర్‌లోనే ఓ అద్భుతమైన రోజు.’ అని ఆ ఫొటోను షేర్‌ చేసింది.

మరిన్ని వార్తలు