అమితాబ్‌ ముందే ఊహించారా?

25 Feb, 2018 09:59 IST|Sakshi

సాక్షి, ముంబై : బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ చేసిన ఓ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీనియర్‌ నటి శ్రీదేవి మరణవార్త మీడియాలో రావటం కంటే ముందే ఆయన ఓ ట్వీట్‌ చేశారు. అయితే ఆ ట్వీట్‌ ఆమె మృతికి సంబంధించిందేనంటూ ఇప్పుడు ఆసక్తికర చర్చ మొదలైంది.

‘ఎందుకో తెలీదు. మనుసులో ఏదో అలజడి రేగుతోంది’  అని ఆయన ఓ ట్వీట్‌ చేశారు. శ్రీదేవి మరణ వార్త మీడియాలో రావటానికి కొన్ని నిమిషాల ముందే ఈ ట్వీట్‌ చేయటం విశేషం. దీంతో ఆమె చనిపోతారని అమితాబ్‌ ముందే ఊహించే ఆ ట్వీట్‌ చేశారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘అమితాబ్‌కు సిక్స్త్‌ సెన్స్‌ పని చేసిందని.. అందుకే ఆయన జరగబోయేది ముందే తెలిసిపోయి ఉంటుందని’ అని అంటున్నారు.

అయితే శ్రీదేవి అమితాబ్‌తో కలిసి ఐదారు చిత్రాల్లో నటించారు. ఆమె కుటుంబంతో ఆయనకు ప్రత్యేక అనుబంధం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు, లేదా సన్నిహిత వ్యక్తులు.. బిగ్‌ బీకి వెంటనే సమాచారం అందించి ఉంటారని, అందుకే ఆయన అలా ట్వీట్‌ చేసి ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు అమితాబ్‌ ఆ ట్వీట్‌పై మళ్లీ స్పందించకపోవటంతో సోషల్‌ మీడియాలో  దానిపై చర్చ ఆగటం లేదు.

మరిన్ని వార్తలు