బర్గర్లకు బదులు సమోసాలు పెట్టండి : ఆనంద్‌ మహీంద్రా

1 Feb, 2020 08:30 IST|Sakshi

మహీంద్రా గ్రూఫ్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో ఎంత చురుకుగా ఉంటారో మనందరికి తెలిసిందే. తాజాగా ఐబీఎమ్‌ నూతన సీఈవోగా నియామకమైన భారత సంతతి అరవింద్‌ కృష్ణకు ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహీంద్రా చేసిన ట్వీట్‌ నవ్వులు పూయిస్తుంది.'భారత సంతతికి చెందినవారు పలు అంతర్జాతీయ సంస్థలలో అత్యంత ఉన్నత స్థాయిలో ఉండడం దేశానికి గర్వకారణం. అమెరికాలోని పలు దిగ్గజ ఐటీ సంస్థలకు భారత సంతతికి చెందిన సత్య నాదేళ్ల, శంతను నారాయణ్‌, సుందర్‌ పిచాయ్‌, తాజాగా అరవింద్‌ కృష్ణలు నాయకత్వం వహిస్తున్నారు. ఇది భారతీయ సంతతి మేనేజర్ల సామర్థ్యానికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఇక మీదట ఎప్పుడైనా వైట్‌హౌస్‌లో టెక్‌ సంస్థలతో సమావేశం నిర్వహిస్తే స్నాక్స్‌లో బర్గర్‌కు బదులుగా సమోసాలను ఉంచాలంటూ' ఫన్నీగా ట్వీట్‌ చేశారు.

మహీంద్రా చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ' ఇక మీదట మీటింగ్స్‌లో సమోసాతో పాటు టీ కూడా ఇవ్వండి' '  వారంతా దక్షిణ భారతీయులు. వాళ్లకు సమోసాలు నచ్చవు కాబట్టి వాటి స్థానంలో దోశ, ఇడ్లీ, ఉప్మాలు స్నాక్స్‌గా ఇవ్వండి' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే అమెరికాకు చెందిన ఐటీ సంస్థలైన గూగుల్‌ అండ్‌ ఆల్ఫాబెట్‌, మైక్రోసాఫ్ట్‌, అడోబ్‌ సిస్టమ్స్‌కు సుందర్‌ పిచాయ్‌, సత్య నాదేళ్ల, శంతను నారాయణ నాయకత్వం వహిస్తున్నారు. తాజాగా ఐబీఎమ్‌ సీఈవోగా 57ఏళ్ల అరవింద్‌ కృష్ణను నియమిస్తున్నట్లు ఆ సంస్థ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. 

మరిన్ని వార్తలు