‘చెత్త కామెంట్లకు తప్ప.. దేనికి పనికొస్తారు’

10 Apr, 2019 13:54 IST|Sakshi

జాత్యంహకార వ్యాఖ్యలు చేసిన నెటిజన్లపై అట్లీ ఫ్యాన్స్‌ ఫైర్‌

ఐపీఎల్‌ సీజన్‌12లో భాగంగా చెన్నై- కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్‌లో కోలీవుడ్‌ హిట్‌ డైరెక్టర్‌ అట్లీ, బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌తో కలిసి మ్యాచ్‌ను వీక్షించాడు. చెన్నైలో జరిగిన ఈ మ్యాచ్‌ సందర్భంగా కోల్‌కతా సహ యజమానితో కలిసి కేకేఆర్‌ గ్యాలరీలో అట్లీ దర్శనమివ్వడంతో సీఎస్‌కే ఫ్యాన్స్‌ నిరాశ చెందారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో.. షారుఖ్‌తో సినిమా చేసేందుకో లేదా ఇలయదళపతి63 సినిమాలో గెస్ట్‌ రోల్‌లో నటింపజేసేందుకు అట్లీ చర్చలు జరుపుతున్నాడేమోలేనని సరిపెట్టుకున్నారు. అయితే మరికొంత మంది మాత్రం షారుక్‌తో అట్లీ ఉండటాన్ని జీర్ణించుకోలేక అతడి శరీర రంగు గురించి అభ్యంతర వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అట్లీ ఫ్యాన్స్‌... ‘తన రంగు గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. నిజానికి ఎన్నో కష్టనష్టాలకు, కఠిన శ్రమకు ఓర్చి అట్లీ ఈ స్థాయికి వచ్చాడు. ప్రస్తుతం షారుఖ్‌ పక్కన కూర్చున్నాడు. మరి మీరేం చేశారు ఇంట్లో కూర్చుని ఓ ప్రతిభావంతుడైన డైరెక్టర్ గురించి కామెంట్లు చేసేందుకు మాత్రమే మీరు పనికివస్తారు. వీరిద్దరి కలయిక ఓ బ్లాక్‌బస్టర్‌ సినిమాకు దారి తీస్తుంది.  ప్రస్తుతం తమిళనాడులోని ప్రముఖ స్టార్లలో అట్లీది ప్రత్యేక స్థానం. అందమైన భార్య చక్కని కుటుంబం, మంచి సంపాదనతో అతడు ఆనందంగా ఉన్నాడు. ఎందుకు ఇలాంటి చెత్త కామెంట్లు చేసి సమయం వృథా చేసుకుంటారు’ అంటూ ట్రోల్స్‌కు గట్టి కౌంటర్‌ ఇస్తున్నారు.

కాగా ఫ్యాన్స్‌ ఊహించినట్లుగానే.. షారుఖ్‌- అట్లీల కాంబోలో మూవీ ఉంటుందని ట్రేడ్‌ అనలిస్ట్‌ రమేష్‌ బాలా ప్రకటించారు. మెర్సెల్‌ సినిమా రీమేక్‌ లేదా మరో కొత్త సినిమాతో వీళ్లిద్దరు ప్రేక్షకుల ముందుకు వస్తారని ఆయన ట్వీట్‌ చేశారు. ఇక ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన అట్లీ..రాజా రాణి సినిమాతో దర్శకుడిగా గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత స్టార్‌ హీరో విజయ్‌తో తెరి, మెర్సల్‌ వంటి హిట్‌ సినిమాలు రూపొందించి పలు అవార్డులు పొందాడు. 2014లో నటి క్రిష్ణ ప్రియను పెళ్లి చేసుకున్నాడు.

మరిన్ని వార్తలు