వైరల్‌: బిడ్డను కాపాడినందుకు థ్యాంక్స్‌ చెప్పిన తల్లి ఏనుగు

11 Nov, 2019 19:17 IST|Sakshi

మనకు సహాయం చేసిన వ్యక్తులకి కృతజ్ఞత చెప్పడం మన కనీస ధర్మం. ఈ విషయం తెలిసీ తెలియక చాలా మంది కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోతుంటారు. కొంత మంది అయితే  చెప్పేదేముందిలే అంటూ లైట్‌ తీసుకుంటారు. కానీ జంతువులు మాత్రం పొందిన సహాయాన్ని మర్చిపోలేవు. దీనికి తాజాగా వైరల్‌ అయిన ఓ వీడియోనే నిదర్శనం. బావిలో పడిపోయిన తన బిడ్డను కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పింది ఓ తల్లి ఏనుగు. సేఫ్‌గా బయట పడ్డాముగా ఇంకేముందిలే అని మనుషుల్లా అలోచించకుండా..తన సైగలతో రక్షించిన వారందరికి థ్యాంక్స్‌ చెప్పింది. 

వీడియోలో ఏముందంటే.. ఓ పిల్ల ఏనుగులో అనుకోకుండా లోతైన బావిలో పడిపోయింది. పైకి వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా రాలేకపోయింది. తల్లి ఏనుగుతో సహా మిగతా ఏనుగులు కూడా ఏమీ చేయలేకపోయాయి. అరుపులు విన్న స్థానికులు లోయలో పడిన ఏనుగును సురక్షితంగా బయటకు తీశారు. జేసీబీలో సహాయంతో మట్టిని బావిలోకి తోస్తూ ఏనుగు బయటకు వచ్చేలా చేశారు. బయటపడ్డ ఏనుగు వెంటనే తన తల్లి ఉన్న గుంపులోకి పరగెత్తింది. పిల్ల ఏనుగు రావడంతో గుంపు అంతా అడవిలోకి వెళ్లింది. తల్లి ఏనుగు మాత్రం మరలా వెనక్కి తిరిగి తొండం పైకిలేపి ఊపుతూ కాపాడిన వారికి కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘అది అద్భుతమైన జంతువు’, ‘హృదయాలను కదలించే ఘటన..మనుషులు జంతువులతో సహజీవనం చేయ్యొచ్చు’, ‘వావ్‌.. జంతువుల నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు’, ‘ బిడ్డను కాపాడిన వారిని తల్లి ఏనుగు ఆశీర్వదించింది’, ‘మనుషుల కంటే జంతువులే బెటర్‌’ అంటూ నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయం మాత్రం తెలియరాలేదు.

మరిన్ని వార్తలు