బైక్‌పై స్నానం.. తిక్క కుదిరింది

27 Jan, 2020 14:24 IST|Sakshi

సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవడం కోసం కొందరు ఎంతకైనా బరితెగిస్తారు అనేదానికి ఈ వీడియో ఒక చక్కటి నిదర్శనం. మనం ఏం చేస్తున్నాం, మనం చేసే పనులతో తోటి వారికి ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అనే వాటి గురించి ఏ మాత్రం ఆలోచించకుండా చేసిన ఆ ఇద్దరిపై సభ్య సమాజం చీవాట్లు పెట్టింది. అంతేకాకుండా చట్ట పరంగా శిక్షకు గురయ్యారు. ఇంతకీ  అసలేం జరిగిందంటే.. దక్షిణ వియత్నాంలో ఓ ఇద్దరు వ్యక్తులు బైక్‌పై హెల్మెట్‌ లేకుండా అర్థనగ్నంగా ప్రయాణించారు. అదేవిధంగా తమతో తెచ్చుకున్న బకెట్‌ వాటర్‌తో బైక్‌పైనే స్నానం చేశారు. అంతేకాకుండా వారు చేసిన ఘనకార్యాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 

అయితే ఇది కాస్త నెట్టింట్లో వైరల్‌ అయింది. దీంతో వారిద్దరూ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతున్నారు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన వారిపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పాపులారిటీ కోసం పరితపించే వారిని శిక్షించాలని కొందరు నెటిజన్లు కోరారు. ఇక వీరిద్దరు చేసిన పనికి దక్షిణ వియత్నాం పోలీసులకు కూడా చిర్రెత్తుకొచ్చింది. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా వారిపై భారీ జరిమానా విధించింది. అంతేకాకుండా ఇలాంటివి మరోసారి పునరావృతం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో ఆ బైక్‌ రైడర్ల తిక్క కుదిరిందని నెటిజన్లు పేర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు