వైరల్‌ : పిచ్చి పీక్‌ స్టేజ్‌కు వెళ్లింది..!!

10 May, 2018 16:18 IST|Sakshi
ఎల్లీ చేతికి అయిన గాయం

సాక్షి, వెబ్‌ డెస్క్‌ : ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌మీడియా ప్లాట్‌ ఫాంలలో లైక్స్‌, ఫాలోవర్స్‌ కోసం వెంపర్లాడటం ఎక్కువైపోయింది. ప్రాణాల మీదకు తెచ్చుకునేంత వరకూ చేరింది. తాజాగా ‘డియోడరెంట్‌ ఛాలెంజ్‌’ వెస్టర్న్‌ దేశాలను ఊపేస్తోంది. చాలెంజ్‌కు సిద్ధమైన వ్యక్తి శరీరంపై డియోడరెంట్‌ ను ఒక చోట స్ప్రే చేస్తారు.

దీంతో అందులో ఉండే రసాయనాల మిశ్రమం వల్ల ఆ భాగంలో గాయం అవుతుంది. బాధను పంటిబిగువన అదిమిపెట్టి ఎవరు ఎక్కువ సేపు ఉంటారో అనేదే చాలెంజ్‌. ఆ తర్వాత లైక్స్‌, ఫాలోవర్స్‌ కోసం సోషల్‌ మీడియాలో చాలెంజ్‌కు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేస్తారు.

జేమీ ప్రెస్కోట్‌ అనే ఇంగ్లండ్‌ మహిళ తన కూతురు ఈ చాలెంజ్‌లో పాల్గొందని, ఈ మేరకు ఆమెకు అయిన గాయాలను ఫొటోలు తీసి ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేశారు. తన కూతురు ఎల్లీ స్నేహితుడిని ఓ పార్కులో కలిసిందని, అతను చాలెంజ్‌ గురించి చెప్పి ఎల్లీపై స్ప్రే చేసినట్లు వెల్లడించారు. దీంతో ఎల్లీకి తీవ్రంగా గాయాలు అయినట్లు వివరించారు.

తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని పిల్లలను ఈ చాలెంజ్‌ తీవ్రంగా గాయపరుస్తుందని జేమీ హెచ్చరించారు. గాయమై ఇప్పటికి 3 వారాలు గడుస్తున్నా అది ఇంకా నయం కాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు