మిత్రులకు, అభిమానులకు గుడ్‌బై..

10 Apr, 2019 13:03 IST|Sakshi

సాక్షి, చెన్నై: బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ చెన్నై నుంచి ముంబై వెళ్తూ విమానంలో దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. చెన్నైలో తన సొంత జట్టు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడగా కోల్‌కతా ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌ అనంతరం షారుఖ్‌ ఖాన్‌ ముంబై బయలు దేరాడు. తిరుగు ప్రయాణంలో కేకేఆర్‌ జట్టుకు చెందిన టీ షర్ట్‌ ధరించి ఉన్న తన సెల్ఫీని సోషల్‌ మీడియాలో పెట్టాడు. ‘ముంబై వెళ్లడానికి తిరుగు ప్రయాణంలో ఉన్నాను. ఈ సెల్ఫీ దిగడానికి ప్రత్యేక కారణాలేమి లేవు. దక్షిణాదిలోని నా సినీ మిత్రులకు, క్రీడా మైదానంలోని క్రికెట్‌ అభిమానులకు గుడ్‌బై’ అంటూ ఈ ఫోటోకు కామెంట్‌ పెట్టాడు. అంతేకాకుండా ‘విజిల్‌ పోడు’ యాష్‌ట్యాగ్‌ జోడించడం ద్వారా తమిళుల పట్ల తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ ఫోటోకు సోషల్‌ మీడియాలో ఏడు లక్షలకు పైగా లైకులు రాగా ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ ఫర్హా ఖాన్‌ ‘ఎంతో అందగాడు’ అంటూ ఫోటోపై స్పందించారు.

దీనికి ముందు, మ్యాచ్‌ సందర్భంగా కెమెరాకు చిక్కిన ధోని, షారుఖ్‌ల ఫోటోను చెన్నై సూపర్‌ కింగ్స్‌ తన అఫీషియల్‌ ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. ఈ ఫోటోలో మ్యాచ్‌ అనంతరం డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్తున్న ధోని, స్టాండ్స్‌లో నిలబడి ఉన్న షారుఖ్‌ పరస్పరం నవ్వుతూ పలకరించుకోవడం కనిపిస్తుంది.

మరిన్ని వార్తలు