అల్లుడిలా బాలయ్య కూడా వర్థంతి చేశాడుగా !

29 May, 2019 17:05 IST|Sakshi

సాక్షి, హిందూపురం : సోదరుడు మరణిస్తే సంభ్రమాశ్చర్యానికి గురైన హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ.. తాజాగా తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ జయంతిని వర్ధంతిని చేశారు. తత్తరపాటుకు లోనవ్వడంలో అల్లుడు నారాలోకేశ్‌ను మించిపోతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ప్రభంజనానికి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కొట్టుకుపోయినా బాలయ్య మాత్రం హిందూపురం నుంచి రెండోసారి విజయం సాధించారు. మంగళవారం తన తండ్రి జయంతి వేడుకులను నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి సతీమణి వసుంధరతో కలిసి పాలభిషేకం చేశారు. అనంతరం హిందూపురంలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ 96వ జయంతిని కాస్త వర్థంతిగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. నెటిజన్లు బాలయ్యను ఓ ఆట ఆడుకుంటున్నారు. జనాలను నవ్వించడంలో మామ అల్లుళ్లు ఏమాత్రం తగ్గడం లేదు కదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
ఎన్టీఆర్‌ జయంతిని వర్ధంతి చేసిన బాలయ్య

గతంలో సోదరుడు నందమూరి హరికృష్ణ మరణం సందర్భంగా మాట్లాడుతూ ఆయన మరణంతో సంభ్రమాశ్చర్యానికి గురైనట్లు తెలిపి నవ్వులపాలైన బాలయ్య.. సినీ దర్శకుడు కోడి రామకృష్ణ మరణించినప్పుడు కూడా ఇలానే మాట్లాడారు. ఇక తెలంగాణ ఎన్నికల ప్రచారంలో సారే జహాసె అచ్చా పాడబోయిన బాలయ్య.. అది పాడలేక బుల్‌బుల్‌ బాలయ్యగా బిరుదు పొందిన విషయం తెలిసిందే. ఆయన అ‍ల్లుడు నారా లోకేశ్‌ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతిని వర్థంతిగా సంభోదించి విమర్శలపాలయ్యారు.  

మరిన్ని వార్తలు