హోటల్‌లో దొంగతనం.. బుక్కయిన ఇండియన్స్‌

29 Jul, 2019 19:56 IST|Sakshi

బాలీ: ఓ హోటల్‌లో బస చేయడం.. అక్కడ ఉన్న వస్తువులను దొంగతనం చేయడం.. ఆఖర్లో అడ్డంగా బుక్కవ్వడం ఇదంతా చదవగానే ఓ తెలుగు సినిమా గుర్తుకొస్తుంది కదా. కానీ నిజంగానే ఇలాంటి సంఘటన ఒకటి బాలీలో చేటు చేసుకుంది. బస చేసిన హోటల్‌లోనే దొంగతనం చేసి.. రెడ్‌హ్యాండెడ్‌గా బుక్కయిన వారు భారతీయులు కావడం ఇక్కడ విషాదం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో తెగ వైరలవుతోంది.

వివరాలు.. పర్యటన నిమిత్తం బాలీ వెళ్లిన ఓ భారతీయ కుటంబం తాము బస చేసిన హోటల్‌ గదిలో దొంగతనానికి పాల్పడ్డారు. హెయిర్‌ డ్రయ్యర్‌, సోప్‌ బాక్స్‌, అద్దం, జార్‌ వంటి వస్తువులను తీసుకుని తమ లగేజ్‌లో ప్యాక్‌ చేసుకున్నారు. గది ఖాళీ చేసి హోటల్‌ నుంచి వెళ్లేటప్పుడు సిబ్బంది వీరి లగేజ్‌ను చెక్‌ చేయడంతో దొంగతనం వెలుగులోకి వచ్చింది. దాంతో ఆ దంపతులు ఒక్కసారిగా తల దించుకున్నారు. క్షమాపణలు చెప్పారు. అంతేకాక తాము తీసిన వస్తువుల ఖరీదు చెల్లిస్తామని వేడుకున్నారు. దీన్నంతా వీడియో తీసి ఇంటర్నెట్‌లో షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. మీ కక్కుర్తి తగలడ.. దేశం పరువు తీశారు కదా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వారి పాస్‌పోర్టును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు
 

ఈ సంఘటనపై నటి మిని మాథుర్‌ కూడా స్పందించారు. ‘పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లి.. భారతదేశ ప్రతిష్టకు భంగం కలిగించే చెత్త పర్యాటకులకు మీరు మంచి ఉదాహరణ. మీలాంటి వారి పనులను ఖండిస్తున్నాను’ అన్నారు.

మరిన్ని వార్తలు