ఆ వ్యక్తి చేసిన పనికి హ్యాట్సాఫ్‌

20 Nov, 2017 13:22 IST|Sakshi

సాక్షి, ముంబై : అమన్‌... రాత్రికి రాత్రే నగరానికి హీరో అయిపోయాడు. ఓ చిన్నారిని కాపాడటమే కాదు.. సురక్షితంగా ఆస్పత్రికి చేరేంత వరకు ఓ పెద్ద ఉద్యమాన్నే నడిపాడు. 

ముంబైకి చెందిన అమన్‌ ఆదివారం సాయంత్రం భందూప్‌ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో అతనికి ఓ శిశువు రోదనలు వినిపించాయి. ఆటోలో ఎవరో ఆ చిన్నారిని వదిలేసి పోయారు. అటుగా చాలా మంది వెళ్తున్నప్పటికీ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. కానీ, అమన్‌ మాత్రం పోలీసులకు సమాచారం అందించేందుకు యత్నించగా... అవతలి నుంచి స్పందన రాలేదు. దీంతో అమన్‌ ఆ పసికందు ఫోటోలను ఆదివారం రాత్రి తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. తనకీ ఏం చేయాలో పాలుపోవటం లేదని సందేశం ఉంచాడు.

అంతే రాత్రికి రాత్రే ఆ ఫోటోలకు అనూహ్యరీతిలో స్పందన వచ్చింది. కొందరు ఆ ఫోటోలను ముంబై పోలీసు శాఖకు చేరవేసేదాకా పోస్టులు చేస్తూనే ఉన్నారు. దీంతో పోలీసులు స్పందించి అతన్ని సంప్రదించారు. సియోన్‌ ఆస్పత్రికి తరలించి ఆ చిన్నారికి చిక్సిత్స అందజేయిస్తున్నారు. ప్రజలంతా అమన్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలంటూ ప్రశంసలు కురిపిస్తూ అతని ఫోటోలు పోస్ట్‌ చేశారు. సీసీ పుటేజీల ఆధారంగా ఆ శిశువును వదిలింది ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు