మళ్లీ జూనియర్‌ ఎన్టీఆర్‌ను వాడుకుంటారా?

22 Oct, 2018 15:42 IST|Sakshi
సక్సెస్‌ మీట్‌లో కల్యాణ్‌ రామ్‌, బాలయ్య, ఎన్టీఆర్‌

సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చ

సాక్షి, హైదరాబాద్‌ : ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా సక్సెస్‌ మీట్‌కు ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ హాజరైన విషయం తెలిసిందే. అయితే బాలకృష్ణ రాకపై సోషల్‌ మీడియా వేదికగా అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ వ్యూహంలో భాగాంగానే బాలకృష్ణ ఈ సక్సెస్‌ మీట్‌కు హాజరయ్యారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ అభినందన సభలో బాలయ్య చేసిన వ్యాఖ్యల చుట్టూనే తీవ్ర చర్చ జరుగుతోంది. వేదికపై అందరి గురించి మాట్లాడిన బాలయ్య జూనియర్‌ ఎన్టీఆర్‌ గురించి ఒక్క మాటతోనే సరిపెట్టడం జూనియర్‌ అభిమానులకు మింగుడుపడటం లేదు. ఈ విషయంలో వారు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌కు బాలయ్యకు సయోద్య లేదని కొందరంటే.. మళ్లీ జూనియర్‌ వాడుకోవాలనే యోచనలో టీడీపీ ఉందని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు.

నాడు హరికృష్ణను అవసరార్థం వాడుకున్నట్లు ఇప్పుడు జూనియర్‌ను వాడుకుంటారని, 2009 ఎన్నికల సీన్‌ను మరోసారి రిపీట్‌ చేస్తారని సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. ఇక 2009 ఎన్నికల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ టీడీపీ తరపున ప్రచారం నిర్వహించారు. ప్రచారం సందర్భంగా రోడ్డు ప్రమాదం జరిగినా.. బెడ్‌పై నుంచే జూనియర్‌ ప్రచారం నిర్వహించారు. ఎన్నికలనంతరం జూనియర్‌ ఎన్టీఆర్‌, హరికృష్ణలను చంద్రబాబు పార్టీకి దూరం చేసిన విషయం తెలిసిందే. హరికృష్ణ మరణంతో నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కటయ్యారు. ఈ నేపథ్యంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ టీడీపీ తరపున మరోసారి ప్రచారం చేయనున్నారా? అనే చర్చ నందమూరి అభిమానుల మధ్య జరుగుతోంది.   

మరిన్ని వార్తలు