ఫైనల్లీ ఇంగ్లండ్‌ ఒక్కటి చేసింది!

1 Jul, 2019 16:36 IST|Sakshi

ప్రపంచకప్‌లో తమ జట్టు సునాయాసంగా సెమీస్‌కు చేరాలంటే ఆదివారం నాటి మ్యాచ్‌లో టీమిండియాకు మద్దతునిస్తామని మాజీ ఆటగాళ్లు సహా పాక్‌ ఫ్యాన్స్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆసియా కప్‌-2018 నాటి ఇండియా-పాక్‌ మ్యాచ్‌లో చోటుచేసుకున్న ఓ సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దాయాది జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఓ పాకిస్తానీ వ్యక్తి మెడచుట్టూ పాక్‌ జెండా వేసుకుని.. భారత జాతీయ గీతం ‘జనమనగణ’ ఆలపించాడు. అప్పట్లో నెటిజన్ల హృదయాలను దోచుకున్న ఈ వీడియోను.. ప్రపంచకప్‌లో ఇండియా-ఇంగ్లండ్‌ మ్యాచ్‌ సందర్భంగా జర్నలిస్టు నలియా ఇనాయత్‌ మరోసారి షేర్‌ చేశారు.

‘ ఈరోజు పాకిస్తానీయులంతా భారతీయులుగా మారుతారు. అంతా మంచే జరగాలని ఆశిస్తారు’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ క్రమంలో వీడియోలో ఉన్న వ్యక్తిని ఆదిల్‌ తాజ్‌గా గుర్తించిన నెటిజన్లు.. ‘ఇప్పటికీ మీకు భారత్‌పై అంతే ప్రేమ ఉందా’ అంటూ అతడిని ప్రశ్నిస్తుండగా.. ‘అవును.. ఇప్పటికీ నేను అలాగే ఉన్నాను’ అంటూ కామెంట్‌ చేశాడు. ఇక ఇండియా- ఇంగ్లండ్‌ మ్యాచ్‌ సందర్భంగా ఆదిల్‌ను ప్రశంసిస్తూ...‘ఫైనల్లీ.. ఇంగ్లండ్‌.. భారత్‌- పాక్‌లను ఒక్కటి చేసింది’ అంటూ చమత్కరిస్తున్నారు.

చదవండి : టీమిండియాకే సపోర్ట్‌ చేయండి: అక్తర్‌

కాగా ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆరెంజ్‌ జెర్సీతో బరిలో దిగిన కోహ్లి సేన ఆతిథ్య జట్టు చేతిలో 31 పరుగుల తేడాతో మెగాటోర్నీలో తొలి ఓటమి చవిచూసింది. ఇక ఈ మ్యాచ్‌లో గనుక భారత్‌ చేతిలో ఇంగ్లండ్‌ ఓడిపోయి ఉంటే సెమీస్‌ రేసు నుంచి నిష్ర్రమించేది. తద్వారా వరుస విజయాలు సాధిస్తూ రేసులోకి వచ్చిన పాక్‌ అవకాశాలు మరింత మెరుగుపడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే.. ఇంగ్లండ్‌పై భారత్‌ గెలవాలని పాక్‌ అభిమానులు కోరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ ఫలితంతో కంగుతిన్న పాక్‌ అభిమానులు, మాజీ ఆటగాళ్లు భారత్‌కు క్రీడానీతి లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

చదవండి : భారత్‌ ఓటమి.. పాకిస్థాన్‌కు మంటెందుకు!

మరిన్ని వార్తలు