జస్ట్‌ మిస్‌.. కొద్దిలో ప్రాణం పోయేదే

18 Feb, 2020 18:18 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రస్తుతం యువత టిక్‌టాక్‌ మోజులో పడి తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రాణాలకు అపాయమని తెలిసినా.. యువత ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తూ వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నారు. తాజాగా ఒక యువకుడు కదులుతున్న ట్రైన్‌లో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తూ టిక్‌టాక్‌లో షేర్‌ చేయాలనే మోజులో ప్రమాదమని తెలిసినా తన విన్యాసం కొనసాగించాడు. ఇంతలో అతని చేయి పట్టు తప్పి ఒక్కసారిగా కిందపడ్డాడు. అంతేగాక అతని తల భాగం దాదాపు రైలు చక్రాల కిందకు వెళ్లినంత పనయింది. కానీ అదృష్టవశాత్తు ఆ యువకుడు ప్రాణాలతో భయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా రైలులోని ప్రయాణికులు వీడియో తీశారు.

కాగా వీడియానూ కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.' నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుని జీవితాలను ప్రమాదంలోకి నెట్టుకొవద్దు. జీవితం చాలా విలువైనదని... ఇలాంటి మూర్ఖత్వంతో దాన్ని ప్రమాదంలో నెట్టకండి' అంటూ క్యాప్షన్‌ జత చేశారు. కదులుతున్న రైలులో ఇలాంటి విన్యాసాలు చేయడం మూర్ఖత్వమేనని పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. దాదాపు 7సెకెన్ల నిడివి ఉన్న వీడియోలో చూడడానికే భయంకరంగా ఉంది. ఆయన షేర్‌ చేసిన వీడియోను దాదాపు 10వేల మందికిపైగా వీక్షించారు. కేంద్రమంత్రి చెప్పింది నిజమేనని.. ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవడం మూర్ఖత్వమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వార్తలు