వైరల్‌: నవ్వుల పాలైన పంజాబ్‌ పోలీసులు

19 Jul, 2018 15:24 IST|Sakshi

చండీగఢ్‌ : అప్పుడప్పుడు మేథావులు కూడా చిన్న చిన్న పొరపాట్లు చేయడం సహజం. ఇలాగే ఓ చిన్న పొరపాటు చేసి నవ్వుల పాలైయ్యారు పంజాబ్‌ పోలీసులు. తరచూ నేరాలకు పాల్పడే ఓ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిని మీడియా ముందు హాజరుపరచి అనంతరం ఆ గ్యాంగ్‌ను ఫోటో తీశారు. ఎవరిని అరెస్ట్‌ చేసినా ఎప్పుడూ చేసే తతాంగమే. ఇందులో నవ్వులపాలు కావడానికి ఏముంది అంటారా..? ఆగండి ఒక్కసారి పైన ఉన్న ఫొటోలను గమనించండి. మీకే నవ్వొస్తుంది. నేరం చేసిన ముఠా సభ్యులకు కుర్చీలు వేసి మరీ కూర్చోబెట్టారు. తప్పు చేసిన వారిలా పోలీసులు మాత్రం వారి వెనుకాల నిలబడ్డారు. అనంతరం తమ తప్పిదాన్ని గమనించి కుర్చీలు తీసేసి కింద కూర్చొబెట్టి ఫొటో తీశారు.

ఇప్పుడా ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు కామెడీగా స్పందించారు. ‘వారిని కుర్చీల్లో కూర్చోబెట్టడంలో తప్పేముంది. నాకు తెలిసి పోలీసులు వారికి గౌరవ మర్యాదలు చేశారు’ అని ఒకరు కామెంట్‌ చేయగా.. ఇలాంటివి ఇండియాలో సాధ్యమే అని మరొకరు, నేరం రుజువైయ్యేంతవరకూ వారు అమాయకులే అని వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. కాగా ఈ ఫొటోలు నిజమైనవో లేదా మార్ఫింగ్‌ చేశారో తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు