సొనాలికి శ్రద్ధాంజలి.. బుక్కైన బీజేపీ ఎమ్మెల్యే

7 Sep, 2018 20:05 IST|Sakshi

ప్రేమను తిరస్కరించిన అమ్మాయిల్ని కిడ్నాప్‌ చేస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్‌ మరోసారి వార్తల్లోకెక్కారు. బాలీవుడ్‌ హీరోయిన్‌ సొనాలీ బింద్రే మరణించారంటూ ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తూ సోషల్‌ మీడియాలో అడ్డంగా బుక్కయ్యారు. ‘ హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమను ఏలిన తార.. తన నటనతో ప్రేక్షకులను రంజింపచేసిన అభినేత్రి ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. ఆమెకు శ్రద్ధాంజలి’ అంటూ రామ్‌ కదమ్‌ ట్వీట్‌ చేశారు.

అయితే ఇది ఫేక్‌ న్యూస్‌ అని తెలుసుకున్న రామ్‌ కదమ్‌.. ‘గత రెండు రోజులుగా సొనాలి బింద్రే గురించి నకిలీ వార్తలు ప్రచారమవుతున్నాయి. ఆమె త్వరగా కోలుకొని సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’ అంటూ మరో ట్వీట్‌తో తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే రామ్‌ కదమ్‌ నెటిజన్ల చేతిలో బుక్కయ్యారు. ‘ఆ నకిలీ వార్తలు ప్రచారం చేసింది మీరే కదా.. మళ్లీ ఇదేంటి’  అంటూ రామ్‌ కదమ్‌ పాత ట్వీట్‌ స్క్రీన్‌షాట్లతో ఆయనను ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. కాగా హైగ్రేడ్‌ క్యాన్సర్‌తో బాధ పడుతున్న సొనాలీ బింద్రే ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు