సాక్షి, న్యూఢిల్లీ : హాస్యం ఎంతటి విషాదాన్నైనా మరపిస్తుందనడంలో సందేహం లేదు. కోవిడ్ మహమ్మారి ప్రపంచ దేశాలతోపాటు భారత్ను వణికిస్తోన్న ప్రస్తుత తరుణంలో ఇంటికే పరిమితమవుతున్న లక్షలాది మంది ప్రజలకు కాలక్షేపం కల్పించేందుకు, హాస్యంతో వారి భయాందోళనలకు కాసేపైనా దూరం చేసేందుకు సోషల్ మీడియా కళాకారులు తమదైన శైలిలో కృషి చేస్తున్నారు. ఈ మధ్య వచ్చిన తెలుగు సినిమా ‘అల వైకుంఠాపురం’లోని సామజవరగమన అనే పాటకు ఇది వరకే చాలా మంది తమదైన రీతిలో పారడీలు కట్టగా తాజాగా కరోనాపై కట్టిన పారడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (కరోనా పరీక్షల్లో వెనకపడ్డ భారత్)
‘నీ ముక్కును పట్టుకు వదలనన్నది చూడే ఆ వైరస్, నీ తుమ్ములను అలా వదిలి పెట్టకు దయలేదా ఓ మిస్! సామజవరగమనా, నేను ఇల్లు దాట గలనా.. వయస్సు మీద వైరస్కున్న అదుపు చెప్పగలనా?’ అంటూ ఒకరు పాట అందుకోగా, రజనీకాంత్ నటించిన ముత్తు సినిమాలోని ‘థిల్లాన థిల్లాన’ పాటకు మరొకరు ‘కరోనా కరోనా మా కనుకప్పి కూన...చైనా వాల్ దాటే వచ్చావా?’ పారడీని పండించారు. ఇప్పటికే ఒకరిద్దరు పాప్ సింగర్లు, పలువురు ఔత్సాహిక సింగర్లు హిందీలో కరోపై పాటలు కూర్చి పాడిన విషయం తెల్సిందే. (మణిపూర్లో తొలి కరోనా పాజిటివ్ కేసు)