ట్రోలింగ్‌; ఫొటో డిలీట్‌ చేసిన సౌందర్య!

1 Jul, 2019 15:20 IST|Sakshi

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె సౌందర్యా రజనీకాంత్‌కు సోషల్‌ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. తన కుమారుడు వేద్‌తో కలిసి స్విమ్మింగ్‌పూల్‌లో ఉన్న ఫొటోను ఆమె షేర్‌ చేశారు. ఈ క్రమంలో..‘తమిళనాడు ప్రజలు నీటి కోసం అలమటిస్తుంటే మీరు మాత్రం ఇలా ఈతకొలనులో నీటిని వృథా చేస్తారా’ అంటూ నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. దీంతో సౌందర్య తన ఫొటోలను తొలగించారు. ఈ నేపథ్యంలో..‘ చిన్నతనం నుంచే పిల్లలకు శారీరక వ్యాయామం అవసరమనే విషయాన్ని చెప్పాలనే సదుద్దేశంతో ఆ ఫొటోను షేర్‌ చేశాను. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న నీటి కొరత నేపథ్యంలో నా ట్రావెల్‌ డైరీలోని ఈ ఫొటోను తొలగించాను’ అని సౌందర్య వివరణ ఇచ్చారు.

కాగా ఈ విషయంలో రజనీ అభిమానులు ఆమెకు అండగా నిలిచారు. ‘పాత ఫొటోతో మిమ్మల్ని ట్రోల్‌ చేస్తున్న వారిని పట్టించుకోకండి. నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న వారికి తలైవా చేస్తున్న సహాయం వారికి కనిపించడం లేదు’ అంటూ ట్రోలర్స్‌కు కౌంటర్‌ ఇస్తున్నారు. ఇక సౌందర్య రజనీకాంత్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తన కుమారుడు వేద్‌కు సంబంధించిన ఫొటోలు తరచుగా ఆమె షేర్‌ చేస్తూ ఉంటారు. కాగా కొచ్చాడియాన్‌ మూవీతో డైరెక్టర్‌గా మారిన సౌందర్యా రజనీకాంత్‌ ఇటీవలె వ్యాపారవేత్త విశాగన్‌ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు