రోడ్ల మీద ఉమ్మేస్తే భారీ మూల్యం తప్పదంటున్న యూకే

12 Apr, 2019 19:51 IST|Sakshi

లండన్‌ : హెడ్డింగ్‌ చూసి ఓ తెగ కంగారు పడిపోకండి. ఇది మన దేశంలో ఉన్న గుజరాతీల కోసం కాదు. యూకేలో నివసిస్తున్న గుజరాతీల కోసం. ఒక్క గుజరాతీలనే కాదు.. యూకేలోని లిసెస్టర్‌లో ఉంటూ పాన్‌ ఇష్టపడే ప్రతీ భారతీయునికి ఈ హెచ్చరిక వర్తిస్తుంది. ఇంతకూ ఈ హెచ్చరిక ఎందుకంటే.. పాన్‌పై మనకున్న మక్కువ వారికి తెగ ఇబ్బంది కలిగిస్తుందట. ముఖ్యంగా లిసెస్టర్‌ ప్రజలు మన వారి పాన్‌ అలవాటు వల్ల తెగ ఇబ్బంది పడుతున్నారట. దాంతో ‘పాన్‌ తిని రోడ్ల మీద ఉమ్మి వేయడం మంచి పద్దతి కాదు. అలా చేసిన వారికి రూ. 13 వేల రూపాయల జరిమానా విదిస్తామ’ని హెచ్చరిస్తూ సైన్‌ బోర్డ్‌ ఏర్పాటు చేశారు అక్కడి పోలీసులు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో తెగ వైరలవుతున్నాయి. ముఖ్యంగా లిసెస్టర్‌లో ఉండే గుజరాతీలు పాన్‌ తినడం..  ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడం చేస్తున్నారట. అందుకే ఈ సైన్‌ బోర్డ్‌ను కూడా ఇంగ్లీష్‌, గుజరాతీ రెండు భాషల్లో ఏర్పాటు చేశారు అధికారులు. అయితే ప్రభుత్వం ఇలా హెచ్చరికలు జారీ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేశారు. కొన్ని రోజుల వరకూ సమస్య సర్దుకున్నట్లే కనిపించింది. తర్వాత మళ్లీ షరా మామూలే. దాంతో ఈ సారి పాన్‌ నమిలి రోడ్ల మీద ఉమ్మేసే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని భావించింది ప్రభుత్వం. అందుకే భారీ మొత్తంలో జరిమానా విధిస్తానంటూ ఇలా సైన్‌ బోర్డులు ఏర్పాటు చేసింది.

మరిన్ని వార్తలు