‘కంటి చూపుతో కాదు.. అరటిపండుతో చంపేస్తా’

29 Dec, 2018 11:57 IST|Sakshi

సినిమాల్లో వచ్చే ఫైట్‌ సీన్స్‌ చాలా కామెడీగా, లాజిక్‌ లేకుండా ఉంటాయి. వందమంది విలన్లనైనా సరే మన హీరో ఒంటి చేత్తో రఫ్పాడిస్తాడు. అదీ చొక్కా నలగకుండా. విలన్‌ ఎంతటి వాడైనా సరే చివరకు హీరోదే పై చేయి అవుతుంది. ఇవే కాక కొన్ని సినిమాల్లో వచ్చే స్పెషల్‌ ఎఫెక్ట్‌లు మరీ దారుణంగా ఉంటాయి. తొడగొడితే.. ట్రైన్‌ ఆగిపోవడం, మీసం తిప్పితే.. ప్రత్యర్థులు భయపడటం వంటివి. వీటికి లాజిక్‌ లేకపోయినా సినిమాలో హీరో క్యారెక్టర్‌ని ఎలివేట్‌ చేయడానికి ఇలాంటి సీన్లు తీస్తుంటారు. తాజాగా అలాంటి ఓ ఫైట్‌ సీన్‌  సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఈ సీన్‌లో మన హీరో ఏకంగా అరటి పండుతోనే అరడజను మంది విలన్ల పీకలు కోస్తున్నాడు. అరటి పండుతో పీకలు కోయడం ఏంటని అనుకుంటున్నారా.. అదే మరి మన సినిమాల గొప్పతనం. హీరో తల్చుకుంటే అరటి పండు ఏం ఖర్మ..!  దాని తొక్కతో కూడా ప్రత్యర్థుల బెండు తీయగలడు. నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా తన ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో ఇప్పుడు తెగ ట్రెండ్‌ అవుతోంది. ‘హృదయ కాలేయం’ ఫేం సంపూర్ణేష్‌ బాబు హీరోగా.. అమిత్‌ నాయర్‌ దర్శకత్వంలో 2015లో వచ్చిన సింగమ్‌ 123 సినిమాలోనిది ఈ సీన్‌.  అదిప్పుడు సోషల్‌ మీడియాలో మరోసారి వైరల్‌ అయింది.

30 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో సంపూ అరటి పండుతో విలన్ల పీకలు కోస్తాడు. అదే విలన్‌ గన్‌తో ఫైర్‌ చేసినా మన హీరోకేం కాదు. బుల్లెట్ల నుంచి చాలా ఈజీగా తప్పించుకుంటాడు. నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా తన ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో నెట్‌ఫ్లిక్స్‌ ఇండోనేషియా వాళ్లకు తెగ నచ్చిందంట. దాంతో మొత్తం సినిమా చూడ్డానికి సాయం చేయండని నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా వారిని కోరారు. ఎందుకంటే నెట్‌ఫ్లిక్స్‌ ఇండోనేషియా తెరకెక్కించిన ‘నైట్‌ కంమ్స్‌ ఫర్‌ ఆస్‌’ సినిమాలో కూడా సేమ్‌ ఇలాంటి సీనే ఉందంట. వీరి రిక్వెస్ట్‌కు స్పందించిన సినిమా నిర్మాత, హీరో మంచు విష్ణు సినిమా సీడీని నెట్‌ఫ్లిక్స్‌ ఆఫీస్‌కు పంపిస్తానని ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు