ప్రపంచంలో అత్యంత తెలివిని ప్రదర్శించే జంతువుల్లో ఏనుగు కూడా ఒకటి. కాలానికి అనుగుణంగా మనుషులతో పోటీ పడుతూ ఏనుగులు కూడా తమ తెలివిని పెంచుకుంటాయని శాస్త్రవేత్తలు చెప్తుంటారు. ఈ విషయం నిజమేనని తాజాగా ఒక ఏనుగు నిరూపించింది. సఫారీ రైడ్లో భాగంగా చాకచక్యంగా వ్యవహరించిన ఏనుగుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నందా ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారి నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
వీడియోలో.. ఏనుగు తనకు అడ్డుగా ఉన్న పోల్ను తొండంతో జాగ్రత్తగా కిందకు నెట్టేసింది. ఇందులో విశేషమేముంది అనుకుంటున్నారా ! అక్కడే ఉంది అసలు కిటుకు.. ఏనుగు తన తొండంతో తీసిన కంచెకు విద్యుత్ సరఫరా అవుతుంది. జంతువులు తమ సురక్షిత స్థానాలు దాటకుండా అడవిలో ఇటువంటి కంచెలను ఏర్పాటు చేస్తారు. కంచె తీగలకు సౌర విద్యుత్ అందిస్తారు. అయితే కంచె దగ్గరకు వచ్చిన సదరు ఏనుగు అవతలి వైపునకు వెళ్లాలని భావించింది. దీంతో ఏం చేయాలా అని ఒక్కక్షణం ఆలోచించి.. తెలివిగా తన తొండంతో చెక్క స్తంభాన్ని గట్టిగా పట్టుకొని కిందకు పడేసింది. తర్వాత చెక్కకు ఆనుకుని ఉన్న విద్యుత్ తీగలను తాకకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తూ అవతలి వైపునకు వెళ్లిపోయింది. దీంతో ఈ వీడియోను చూసిన వాళ్లంతా ఈ ఏనుగు చాలా తెలివైందంటూ కామెంట్లు చేస్తున్నారు.