పేరుకే సీక్వెల్‌..

5 Apr, 2018 08:31 IST|Sakshi

తమిళసినిమా: కోలీవుడ్‌లో సీక్వెల్‌ ట్రెండ్‌ అధికంగా సాగుతోందని చెప్పవచ్చు. ఎందిరన్‌కు సీక్వెల్‌గా 2.ఓ చిత్రం పూర్తి కావస్తున్న విషయం తెలిసిందే. గతంలో ప్రభు, ప్రభుదేవా కలిసి నటించిన చార్లీచాప్లిన్‌కు కొనసాగింపు నిర్మాణంలో ఉంది. త్వరలో కమలహాసన్‌ ఇండియన్‌ చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కడానికి రెడీ అవుతోంది. తాజాగా అరమ్‌–2 చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అరమ్‌ నటి నయనతారను లేడీ సూపర్‌స్టార్‌ చేసిన చిత్రం ఇది. ప్రజాక్షేమం కోసం తపించే ఒక జిల్లా అధికారిణిగా నయనతార నటనకు సినీ విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రం ప్రేక్షకుల మధ్య విశేష ఆదరణను చూరగొంది.

దీంతో ఈ చిత్ర సీక్వెల్‌కు నయనతార గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఆ చిత్ర దర్శకుడు గోపీనయినర్‌ ఇప్పుడు కథను వండే పనిలో ఉన్నారు. దీని గురించి ఆయన చెబుతూ ఈ చిత్రం పేరును ప్రస్తుతానికి అరమ్‌–2 అని అనుకుంటున్నామని, అయితే కథ వేరేలా ఉంటుంద న్నారు. చిత్ర కథకు అరమ్‌ చిత్ర కథకు సంబంధం ఉండదని చెప్పారు. అయితే అరమ్‌ చిత కథలానే ఈ చిత్రం కథ సామాజక అంశంతో కూడి ఉంటుందని తెలిపారు. ఇందులో నయనతార పాత్ర పూర్తిగా విభిన్నంగా ఉంటుందని చెప్పారు. షూటింగ్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించనున్నట్లు దర్శకుడు గోపీనయినర్‌ వెల్లడించారు. చిత్ర కథ డాక్టర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగ అంశాలను ఆవిష్కరించే విధంగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. అయితే అరమ్‌–2 పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్దిరోజులు ఆగాల్సిందే.

మరిన్ని వార్తలు