స్వీటీ మాలీవుడ్‌ ఎంట్రీ..

2 Apr, 2018 08:02 IST|Sakshi

సాక్షి, సినిమా: స్వీటీ మాలీవుడ్‌ ఎంట్రీ షురూ అయ్యిందంటున్నారు సినీ వర్గాలు. బెంగళూరుకు చెందిన యోగా టీచర్‌ అనుష్క. సూపర్‌ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు నాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అదే విధంగా రెండో చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అయ్యారు. అయితే టాలీవుడ్‌నే అనుష్కను ఆదరించింది. ఆదిలో అందాలారబోసినా, అరుంధతి చిత్రం అనుష్క సినీ జీవితాన్ని మార్చేసింది. అప్పటి నుంచి హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రాలు అనుష్క తలుపుతట్టడం మొదలెట్టాయి. కోలీవుడ్‌లో అడపాదడపా నటిస్తూ ఇక్కడా తన ఉనికిని చాటు కుంటున్న అనుష్క బాహబలి సిరీస్, భాగమతి వంటి చిత్రాలు తన స్థాయిని మరింత పెంచేశాయి. అయితే మొదటి నుంచి ఎక్కువ చిత్రాలు చేయాలని కాకుండా మంచి కథా పాత్రల్లో నటించడానికే ఈ స్వీటీ ఆసక్తి చూపుతున్నారు. భాగమతి చిత్రం మంచి విజయం సాధించినా, మరో చిత్రం ఇప్పటి వరకూ కన్ఫార్మ్‌ కాలేదు. అయితే గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించినట్లు ఇటీవల అనుష్కనే స్వయంగా వెల్లడించారు.

అయితే అది ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియదు. మధ్యలో అనుష్కకు పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు భావిస్తున్నారు. వయసు పెరుగుతోందని పెళ్లికి ఒత్తిడి చేయడంతో అనుష్క కూడా ఈ ఏడాది చేసుకుంటానని వారికి మాట ఇచ్చినట్లు ప్రచారం. ఇలాంటి పరిస్థితుల్లో మాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధమైందని, మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టితో జతకట్టేందుకు రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. మలయాళంలో నటించాలన్న కోరిక అనుష్కకు చాలా కాలంగానే ఉందట. అయితే అలాంటి మంచి అవకాశం కోసం ఎదురు చూస్తుండగా మమ్ముట్టి సరసన అనగానే అంగీకరించినట్లు తెలిసింది. దీనికి శరత్‌ సందీప్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకు ముందు మమ్మట్టి హీరోగా పరోల్‌ అనే చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. అనుష్క మాలీవుడ్‌ ఎంట్రీ చిత్రం గురించి త్వరలోనే అధికారికపూర్వ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు