వడివేలు మొండిపట్టు

17 Apr, 2018 07:16 IST|Sakshi

సాక్షి సినిమా:ఇంసై అరసన్‌ 24ఆమ్‌ పులికేసి చిత్రానికి వడివేలు మొండికేశారు. హాస్యనటుడిగా ఉన్న వడివేలు ఇంసైఆరసన్‌ 23ఆమ్‌ పులికేసి చిత్రంతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆ చిత్రానికి శంకర్‌ నిర్మాత. శింబుదేవన్‌ దర్శకుడు. ఆ చిత్రం విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌ను ప్రారంభించారు. అయితే కొంత షూటింగ్‌ జరిగిన తరువాత చిత్రానికి సమస్యలు వడివేలు రూపంలో మొదలయ్యాయి. శంకర్‌ వడివేలుపై నిర్మాతల మండలిలో, దక్షిణ భారత నటీనటుల సంఘంలోనూ ఫిర్యాదు చేశారు.

ఆ సంఘాలు  విడివేలు వివరణ కోరుతూ లేఖలు పంపాయి. తాజాగా వడివేలు నటీనటుల సంఘానికి బదులు లేఖ రాశారు.  అందులో.. తాను పులికేసి చిత్రంలో నటించడానికి 1–6–2016లో ఒప్పుకున్నానన్నారు. 2016 డిసెంబరు లోగా చిత్రాన్ని పూర్తి చేస్తామని, అప్పటివరకూ ఇతర చిత్రాల్లో నటించరాదని తనతో చెప్పారన్నారు. అయితే నిర్ణీత గడువులోగా చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో తాను పలుసార్లు కాల్‌షీట్స్‌ ఇచ్చి పులకేశి చిత్రంలో నటించానని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో తన కాస్ట్యూమర్‌ ఎస్‌.ప్రకాశ్‌ను సంస్థ నుంచి తొలగించారని ఆరోపించారు.  నిర్ణీత గడువు పూర్తయిన తర్వాత దురుద్దేశంతోనే తనపై ఫిర్యాదు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ చిత్రంలో నటిస్తే తాను అంగీకరించిన పలు చిత్రాలకు ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ వివరణపై నటీనటుల సంఘం, నిర్మాతల సంఘం వడివేలు లేఖపై ఎలా స్పందిస్తారో చూడాలి.

మరిన్ని వార్తలు