రజనీపై మరోసారి ఫైర్‌

1 May, 2018 08:23 IST|Sakshi

తమిళసినిమా: దర్శకుడు భారతీరాజా సందర్భం వచ్చినప్పుడల్లా రజనీకాంత్‌పై విరుచుకు పడుతున్నారు. ఆ మధ్య కన్నడిగుడైన రజనీకాంత్‌ను తమిళ సినిమాలో ఆదరించాం కానీ, రాష్ట్రాన్ని ఏలతానంటే ఒప్పుకునేది లేదని ధ్వజమెత్తారు. తాజాగా మరోసారి రజనీపై దండెత్తారు. ఇంతకు ముందు మధురై సంభవం, తొప్పి, శివప్పు ఎనక్కు పిడిక్కుమ్‌ చిత్రాలను తెరకెక్కించిన యురేకా దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం కాట్టు ప్పయ సార్‌ ఇంద కాళీ. నటుడు జయంత్‌ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజస్థాన్‌కు చెందిన ఐరా కథానాయకిగా పరిచయం అవుతోంది. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ సోమవారం ఉదయం వడపళనిలోని కమలా థియేటర్‌లో జరిగింది.

ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ తమిళ మట్టి, సంస్కృ తి, సంప్రదాయాలు తనకు తల్లితో సమానం అన్నారు. వాటికి చెడు కలుగుతుంటే చూస్తూ ఊరుకోనని అన్నారు. కొన్ని చిత్రాల పేర్లతో తాను ఏకీభవించలేనని, కాట్టు ప్పయ సార్‌ ఇంద కాళీ కూడా అలానే ఉందన్నారు. ఇలాంటి టైటిల్స్‌తో నటులను మనమే పైకి ఎత్తేస్తున్నామన్నారు. మనం రాసిన సంభాషణలు చెప్పి, పాటల్లో ఆడి రేపు రాష్ట్రాన్ని ఏలతామని బయలుదేరతారన్నారు. ఇలానే అతను రెడీ అయ్యాడు. నిజానికి అతనికేమీ తెలియదు పాపం అని (రజనీకాంత్‌నుద్దేశించి) విమర్శించారు. అభిమానులను మోసం చేస్తున్నారని, కటౌట్‌లకు పాలాభిషేకాలు చేసే వారిని అప్పుడే నిలువరించాల్సిందని,ఇదంతా మనం చేస్తున్న తప్పు అని వ్యాఖ్యానించారు. చిత్ర దర్శకుడు యురేకా ఇంతకు ముందు చేసిన చిత్రాలను చూశానని, సినీరంగానికి వచ్చామా, వెళ్లామా అన్నట్టు కాకుండా సమాజానికి ఏమైనా చెప్పాలన్న తపన ఉన్న దర్శకుడు యురేకా అని భారతీరాజా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు